ఐపీఎల్ 14 నిరవధిక వాయిదా
అమిత్ మిశ్రా, సాహాకు పాజిటివ్ మైక్ హస్సీకి కూడా
అందరూ భయపడినట్టుగానే జరిగింది..! దేశాన్ని కుదిపేస్తున్న కరోనా.. ఐపీఎల్పై పంజా విసిరింది..! సాఫీగా సాగుతున్న లీగ్ను నిరవధికంగా వాయిదా పడేలా చేసింది..! తాజాగా సన్రైజర్స్ ప్లేయర్ వృద్ధిమాన్ సాహా, అమిత్ మిశ్రాకు వైరస్ సోకడం.. హైదరాబాద్ టీమ్ మొత్తం క్వారంటైన్లోకి వెళ్లాల్సి రావడం.. మిగతా ఫ్రాంచైజీలు కూడా ఐసోలేషన్లో ఉండటంతో.. బీసీసీఐ తల పట్టుకుంది..! చేసేదేమీలేక ఆటను ఆపేసింది..! ఆటగాళ్ల ఆరోగ్య భద్రతకు ఓటేసి.. లీగ్ను సస్పెండ్ చేసింది..! ఇప్పట్లో నిర్వహించే చాన్స్ లేకపోయినా.. మరో విండోలో ప్రయత్నిస్తామని చెప్పింది..!
న్యూఢిల్లీ: అందరూ ఆసక్తిగా చూస్తున్న ఐపీఎల్ను కరోనా దెబ్బ కొట్టింది. బయో బబుల్లోనూ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో.. బీసీసీఐ లీగ్ను నిరవధికంగా వాయిదా వేసింది. దీంతో నెల రోజుల పాటు సాఫీగా సాగిన మెగా లీగ్ వైరస్ దెబ్బకు మధ్యలోనే ఆగిపోయింది. తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, ఢిల్లీ క్యాపిటల్స్ వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా, సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీకి పాజిటివ్ వచ్చింది. దీంతో హైదరాబాద్ టీమ్ మొత్తం క్వారంటైన్లోకి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. మిగతా ఫ్రాంచైజీల్లో కూడా పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో బీసీసీఐ మంగళవారం అత్యవసరంగా సమావేశమై లీగ్ను సస్పెండ్ చేసింది. అన్ని ఫ్రాంచైజీలు, బ్రాడ్కాస్టర్, ఇతర వాటాదారులు కూడా ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ‘టోర్నీని నిరవధికంగా సస్పెండ్ చేస్తున్నాం. నెక్స్ట్అందుబాటులో ఉన్న విండోలో మిగతా టోర్నీని కంప్లీట్ చేసేందుకు ట్రై చేస్తాం. కానీ ఈ నెలలో మాత్రం కాదు’ అని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ పేర్కొన్నాడు. 60 మ్యాచ్ల లీగ్లో ఇప్పటికి 29 మ్యాచ్లు పూర్తయ్యాయి. మరో 31 మ్యాచ్లు జరగాల్సి ఉంది.
నాలుగు టీమ్స్కు ఎఫెక్ట్..
కరోనా ఎఫెక్ట్ నాలుగు ఫ్రాంచైజీలపై పడడంతో లీగ్ను వాయిదా వేయక తప్పలేదు. సోమవారం కేకేఆర్ఇద్దరు ప్లేయర్లతో పాటు సీఎస్కే బౌలింగ్ కోచ్ బాలాజీ పాజిటివ్గా తేలాడు. అతనితో కాంటాక్ట్ దృష్ట్యా చెన్నై టీమ్ కూడా క్వారంటైన్లోకి వెళ్లాలని డిసైడైంది. దాంతో, తొలుత బుధవారం జరిగే సీఎస్కే–రాజస్తాన్ను రీషెడ్యూల్ చేశారు. ఆపై, లీగ్ను వారం రోజుల పాటు వాయిదా వేసి.. ఆ తర్వాతి నుంచి రోజుకు రెండు మ్యాచ్లు ఆడించాలని బోర్డు భావించిందని సమాచారం. ఆ దిశగా టీమ్లను ముంబైకి తరలించి అక్కడే మ్యాచ్లు జరిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టిందట. హోటల్స్తో కూడా మాట్లాడినట్లు సమాచారం. కానీ సాహా, మిశ్రాకు వైరస్ సోకిందని పబ్లిక్గా తెలిసిపోవడంతో.. బీసీసీఐ, ఐపీఎల్ జీసీ.. అర్జెంట్ మీటింగ్ను ఏర్పాటు చేశాయి. ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్తో పాటు లీగ్తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి సేఫ్టీ తమకు ముఖ్యమని చెబుతూ లీగ్ను సస్పెండ్ చేశాయి. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో లీగ్ను వాయిదా వేయడం మినహా మరో మార్గం లేదు. ప్లేయర్ల సేఫ్టీతో మేం కాంప్రమైజ్ కాలేం. అందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఐపీఎల్ పేర్కొంది.
ఫారిన్ ప్లేయర్లను సేఫ్గా పంపిస్తాం: బ్రిజేష్
లీగ్లో పాల్గొంటున్న ఫారిన్ ప్లేయర్లను సేఫ్గా వాళ్ల దేశాలకు పంపిస్తామని లీగ్ చైర్మన్ బ్రిజేష్ హామీ ఇచ్చాడు. ఇందుకు అవసరమైన మార్గాలను వెతుకుతున్నామని చెప్పారు. ‘ఇండియాలో ఇప్పుడు డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉంది. అయినప్పటికీ బీసీసీఐ తన అన్ని రకాల పవర్స్ను ఉపయోగించి క్రికెటర్లను వాళ్ల ఇంటికి సేఫ్గా పంపిస్తుంది’ అని పటేల్ తెలిపారు.ఇంగ్లండ్ (11), ఆస్ట్రేలియా (14), న్యూజిలాండ్ (10) సౌతాఫ్రికా (11), వెస్టిండీస్ (9), అఫ్గానిస్తాన్ (3), బంగ్లాదేశ్ (2) ప్లేయర్లను పంపించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టినట్లు సమాచారం.
మాల్దీవ్స్కు ఆసీస్ క్రికెటర్లు
ఇండియా నుంచి వచ్చే కమర్షియల్ ఫ్లైట్స్పై ఈ నెల 15 వరకు ఆస్ట్రేలియా బ్యాన్ విధించింది.ఈ లోపు ఎవరైనా ఇండియా నుంచి ఆసీస్లో అడుగు పెడితే జైల్లో పెడతామని అధికారిక ప్రకటన చేసింది. అయితే దీనిపై ఐపీఎల్ క్రికెటర్లకు మినహాయింపు ఇవ్వాలని అడిగేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఇష్టపడటం లేదు. అయినప్పటికీ తమ ప్లేయర్లను సేఫ్గా తీసుకొచ్చేందుకు బీసీసీఐతో కలిసి పని చేస్తామని సీఏ స్పష్టం చేసింది. కాగా, 15 వరకూ స్వదేశం వెళ్లే అవకాశం లేకపోవడంతో ఆసీస్ ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్స్, కోచ్లు.. మాల్దీవ్స్కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అక్కడ కొన్ని రోజుల క్వారంటైన్ తర్వాత ఆసీస్కు తిరిగి వెళ్లాలని భావిస్తున్నారు.
రూ. 2 వేల కోట్ల నష్టం
ఐపీఎల్ను మధ్యలో ఆపేయడం వల్ల బీసీసీఐ భారీగా నష్టపోతున్నది. సగం మ్యాచ్లే కంప్లీట్ కావడంతో దాదాపు 2 వేల నుంచి 2500 కోట్ల వరకు నష్టం వాటిల్లనుంది. ‘ఇప్పటివరకు 24 రోజుల క్రికెట్ మాత్రమే కంప్లీట్ అయ్యింది. ఇంకా సగం మ్యాచ్లున్నాయి. కచ్చితంగా చెప్పాలంటే రూ. 2200 కోట్లు నష్టం రానుంది. ఇందులో బ్రాడ్కాస్ట్, స్పాన్సర్షిప్ మనీ ఉంది’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఐదేళ్ల కాంట్రాక్ట్ కింద స్టార్.. బీసీసీఐకి రూ. 16,374 కోట్లు చెల్లిస్తుంది. అంటే ఏడాదికి రూ. 3269 కోట్లు. ప్రతి సీజన్లో 60 మ్యాచ్లు ఉంటాయి కాబట్టి.. ప్రతి మ్యాచ్కు సుమారు రూ. 54.5 కోట్లు ఇస్తుంది. ఇప్పటివరకు 29 మ్యాచ్లు కంప్లీట్ అయ్యాయి కాబట్టి .. రూ. 1580 కోట్లు స్టార్ చెల్లిస్తుంది. ఫుల్ టోర్నీ లేదు కాబట్టి మిగతా రూ. 1690 కోట్లు ఇవ్వదు. టైటిల్ స్పాన్సర్షిప్ రూ. 440 కోట్లలో సగం మాత్రం రావొచ్చు. అసోసియేట్ స్పాన్సర్ల నుంచి రావాల్సిన రూ. 120 కోట్లు కూడా కష్టమే. వీటన్నింటివల్ల సెంట్రల్ రెవెన్యూ పూల్ మనీ కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఫ్రాంచైజీలకు కూడా భారీగానే నష్టం వాటిల్లనుంది.