మన మార్కెట్ పై కరోనా ఎఫెక్ట్

మన మార్కెట్ పై కరోనా ఎఫెక్ట్

మన మార్కెట్లు ఆగమాగం
తగ్గిన దిగుమతులు.. ఆగిన ప్రొడక్షన్‌
చాలా వస్తువుల కోసం చైనాపైనే ఆధారం
మన మార్కెట్‌‌పై కరోనా ఎఫెక్ట్‌‌!

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా వైరస్​ కేసు ఒక్కటి కూడా డిటెక్ట్‌‌‌‌ కాలేదు. కానీ దాని ఎఫెక్ట్‌‌‌‌  మరో రూపంలో జనంపై కనబడుతోంది. చైనాలో వైరస్​ దెబ్బకు చాలా రకాల వస్తువుల ప్రొడక్షన్‌‌‌‌ ఆగిపోవడం గట్టిగానే ప్రభావం చూపుతోంది. చైనా ప్రొడక్టుల దిగుమతులు తగ్గిపోవడంతో ఇక్కడ ధరలు పెరుగుతున్నాయి. ముడి సరుకులు, స్పేర్​పార్టులు అందుబాటులో లేక చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఆటోమొబైల్స్​ నుంచి మందులు, మెడికల్​ ఎక్విప్​మెంట్, సెల్​ఫోన్లు, బొమ్మలు, చిన్నచిన్న ప్లాస్టిక్​ వస్తువుల దాకా ఈ ఎఫెక్ట్​ కనిపిస్తోంది.

వాటికి కొరత రావడంతో ఇప్పటికే ధరలు పెరుగుతున్నాయి. ఇంకొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే తీవ్ర ప్రభావం పడుతుందని మార్కెట్​ వర్గాలు చెప్తున్నాయి. మనకు తెలియకుండానే మన జీవితాలను చైనా ప్రొడక్టులు ఎంతగా పెనవేసుకుపోయాయో ‘కరోనా’ఎఫెక్ట్‌‌‌‌ చూస్తే స్పష్టమవుతోంది.

భయపెడ్తున్న కరోనా

కరోనా వైరస్‌‌‌‌ ప్రస్తుతం చైనాతోపాటు 30 దేశాలను గడగడా వణికిస్తోంది. చైనాలో ఇప్పటికే 5 వందల మంది వరకు దానికి బలైపోయారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు అలర్టయ్యాయి. చైనాకు రాకపోకలు నిలిపివేశాయి. చైనాలోని చాలా ప్రాంతాలకు విమానాలూ నడపడం ఆపేశాయి. ఆ దేశం నుంచి వచ్చిన వారికి ఎయిర్‌‌‌‌పోర్టుల్లోనే స్క్రీనింగ్‌‌‌‌ చేస్తున్నారు. హాస్పిటళ్లకు తరలించి టెస్టులు చేస్తున్నారు. కొద్దిరోజులు ఆస్పత్రులు, ఇండ్లలోనే ఉంచి అబ్జర్వేషన్​లో పెడ్తున్నారు. మరోవైపు చైనాలో వైరస్‌‌‌‌ భయంతో చాలా కంపెనీలు మూసేయడంతో ప్రొడక్షన్‌‌‌‌ తగ్గిపోయింది. మన మార్కెట్‌‌‌‌పై అది ప్రభావం చూపుతోంది.

కార్లకు స్పేర్​పార్టుల్లేవ్..

కొన్ని కంపెనీల కార్లు, బైకుల్లో ఉపయోగించే స్పేర్​పార్టులు చైనాలోనే తయారవుతాయి. ఇప్పుడు దిగుమతులు ఆగిపోయి ఆటోమొబైల్‌‌‌‌ రంగంపై ప్రభావం పడింది. తనకు కార్‌‌‌‌ డెలివరీ చేస్తామని చెప్పి రోజులు గడుస్తున్నా ఇవ్వడం లేదంటూ ఓ కస్టమర్‌‌‌‌ బుధవారం హైదరాబాద్​లోని బంజారాహిల్స్‌‌‌‌ పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు షోరూం ఓనర్‌‌‌‌ను ఎంక్వైరీ చేయగా.. కరోనా ఎఫెక్ట్‌‌‌‌తో కార్లు, స్పేర్​పార్టుల సప్లై ఆగిపోయిందని, మార్చిలో పంపుతామని కంపెనీ (ఎంజీ మోటార్స్‌‌‌‌) చెప్పిందని వివరించారు. దీంతో పోలీసులు కస్టమర్‌‌‌‌నే కన్విన్స్‌‌‌‌ చేయాల్సి వచ్చింది. స్పేర్​పార్టులు రాక హ్యుండయ్‌‌‌‌ కార్ల రిపేరింగ్‌‌‌‌కు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎల్‌‌‌‌బీనగర్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ సెంటర్‌‌‌‌లోని ఒక ఇంజనీర్‌‌‌‌ తెలిపారు. కస్టమర్లకు సర్ది చెప్పలేక ఇబ్బందిపడుతున్నామన్నారు. థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌ నుంచి భారత్‌‌‌‌కు అగ్రో మిషనరీని మార్కెట్‌‌‌‌ చేసే ఓ ఏజెంట్‌‌‌‌ మాట్లాడుతూ.. తనను అక్కడకు రావొద్దని కంపెనీ మెయిల్‌‌‌‌ చేసిందని, కొద్దిరోజులు సప్లై కూడా ఉండదని పేర్కొన్నదని తెలిపారు. నెలలో అంతా సర్దుకుంటుందని, అప్పుడు కాంటాక్ట్‌‌‌‌ చేస్తామని చెప్పారని వివరించారు.

మాస్కులూ దొరకట్లేదు

ఇక హాస్పిటళ్లలో వాడే మెడికల్, సర్జికల్​ ఎక్విప్​మెంట్లు, ప్రొడక్టులు వచ్చేదీ చైనా నుంచే. దీనిపై ఇండియన్‌‌‌‌ మెడికల్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ స్టేట్‌‌‌‌ రిప్రజెంటేటివ్‌‌‌‌ డాక్టర్‌‌‌‌ సంజీవ్‌‌‌‌ సింగ్‌‌‌‌ యాదవ్‌‌‌‌ మాట్లాడుతూ.. ‘‘గ్లవ్స్‌‌‌‌, మాస్క్‌‌‌‌ల నుంచి హైఎండ్‌‌‌‌ ఎక్విప్‌‌‌‌మెంట్‌‌‌‌ వరకు అన్నీ చైనా నుంచే ఎక్కువగా వస్తాయి. తక్కువ ధర ఉంటుంది. మన దగ్గర వాటి మ్యాన్యుఫాక్చరింగ్‌‌‌‌ చాలా తక్కువ. అందుకే చైనా నుంచి కొంటాం. కరోనా ఎఫెక్ట్‌‌‌‌తో వాటి ఇంపోర్టు తగ్గింది. దాంతో లోకల్​ ఎక్విప్​మెంట్ల ధరలు మరింతగా పెంచేశారు. చిత్రమైన విషయం ఏమిటంటే.. కొత్త కొత్త వైరస్‌‌‌‌లు వచ్చినపుడు పూర్తిస్థాయి జాగ్రత్త కోసం వాడే ఎన్‌‌‌‌ 95 మాస్కులు కూడా చైనా నుంచి రావాల్సిందే” అని తెలిపారు. ఇక నాంపల్లిలోని ఓ మెడికల్​ఏజెన్సీ ప్రతినిధి మాట్లాడుతూ.. పది రోజుల నుంచి ఎన్​95 మాస్కులు రావడం లేదని, సాధారణంగా రూ. 80 వరకు ఉండే మాస్కులను రూ. 200 వరకు ధరతో అమ్ముతున్నారని చెప్పారు. ఎన్​95 మాస్కులు లేక ఇండియాలో తయారయ్యే సర్జికల్‌‌‌‌ మాస్కులనే అమ్ముతున్నామని చెప్పారు. అవికూడా రెండు, మూడు రూపాయలకు దొరికేవి, ఇప్పుడు పది రూపాయలకు అమ్ముతున్నారని తెలిపారు.

బొమ్మల దుకాణాలపైనా అసర్

హైదరాబాద్​లోని బేగంబజార్‌‌‌‌లో చైనా బొమ్మలు, ప్లాస్టిక్‌‌‌‌ వస్తువులను అమ్మే హోల్‌‌‌‌సేల్‌‌‌‌ డీలర్‌‌‌‌ కమలేష్‌‌‌‌ మాట్లాడుతూ.. ‘‘కరోనా వైరస్‌‌‌‌ అసర్‌‌‌‌ మా మీద కూడా పడింది. వారం రోజుల నుంచి చైనా నుంచి ప్రొడక్ట్స్‌‌‌‌ వస్తలేవు. ఇపుడున్న వాటితోనే నడుపుతున్నం. వారం, పది రోజుల్లో స్టాక్‌‌‌‌ అయిపోతుంది. అప్పటికీ కొత్త స్టాక్‌‌‌‌ రాకపోతే రేట్లు బాగా పెరిగే పరిస్థితి రావొచ్చు..’’అని తెలిపారు. ఇప్పటికే మార్కెట్లో చాలా మంది 20 శాతం వరకు రేట్లు పెంచినట్టు కొనుగోలుదారులు చెప్తున్నారు. ఒక్క బేగంబజార్​ మాత్రమే కాదు దాదాపు అన్ని మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి ఉంది.

సెల్​ఫోన్లకూ కష్టమొచ్చింది

దాదాపు అన్ని కంపెనీల ఫోన్లు, వాడి స్పేర్​పార్టులు చైనాలోనే తయారవుతాయి. కరోనా ఎఫెక్ట్​తో దిగుమతులు నిలిచిపోవడంతో కొత్త ఫోన్లు, రిపేరింగ్‌‌‌‌లపైనా దెబ్బపడింది. హైదరాబాద్​ గుజరాతీ గల్లీలోని శివమ్‌‌‌‌ మొబైల్స్‌‌‌‌ ఓనర్‌‌‌‌ రిజూ మాట్లాడుతూ.. ‘‘10, 15 రోజుల నుంచి ఫోన్లు మార్కెట్‌‌‌‌కు రావడం తగ్గింది. స్పేర్‌‌‌‌ పార్టులు కూడా వస్తలేవు. ఫోన్ల స్టాక్​ బాగానే ఉంది. వాటికి పదిహేను, ఇరవై రోజుల దాకా ప్రాబ్లమేం లేదు. స్పేర్‌‌‌‌ పార్ట్‌‌‌‌ల కోసం చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పటికే పార్టుల ధరలు పెరిగినయ్. కస్టమర్ల నుంచి ఎక్కువ వసూలు చేయక తప్పడం లేదు. ఇట్లనే ఉంటే ఇంకో పది రోజుల తర్వాత ఫోన్ల రిపేరింగ్‌‌‌‌ కూడా కష్టమైతది..”అని వాపోయారు. కరోనా ఎఫెక్ట్‌‌‌‌ ఎక్కువ రోజులు కొనసాగితే పనిచేసుకునేదెట్లాగన్న బెంగ ఆయన మాటల్లో కనిపించింది.

నాన్వెజ్కు ఎఫెక్ట్

జంతువుల ద్వారా కరోనా వైరస్‌‌‌‌ సోకిందన్న వార్తలతో జనంలో ఆందోళన కనిపిస్తోంది. సోషల్‌‌‌‌ మీడియాలో చైనావాళ్లు తినే రకరకాల జంతువుల వీడియోలు వైరల్‌‌‌‌ అవుతున్నాయి. దీంతో నాన్​ వెజ్​ వల్ల వైరస్​ సోకుతుందన్న భయంతో చాలా మంది మటన్, చికెన్​ కూడా బంద్‌‌‌‌ చేస్తున్నారు. అమ్మకాలు తగ్గిపోవడంతో చికెన్‌‌‌‌, మటన్‌‌‌‌ సెంటర్ల వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాగ్‌‌‌‌లింగంపల్లిలో చికెన్‌‌‌‌ సెంటర్‌‌‌‌ నడుపుతున్న బిస్మిల్లా మాట్లాడుతూ.. ‘‘సోషల్‌‌‌‌ మీడియాలో వీడియోలు చూసి చికెన్‌‌‌‌ తింటే కరోనా వస్తదని భయపడుతున్నరు. ఆ దేశంలో ఒక దగ్గర నాలుగు వేల కోళ్లు చచ్చిపోయినట్లు న్యూస్‌‌‌‌ వచ్చిందట. నా దగ్గరికి రెగ్యులర్‌‌‌‌గా వచ్చే కస్టమర్లు కూడా ఆ భయంతోనే కొన్ని రోజులు చికెన్‌‌‌‌కు దూరంగా ఉంటమని చెప్తున్నరు”అని తెలిపారు.

ఇంకో ఏడాది ఎఫెక్ట్​ ఉంటది

-డాక్టర్‌‌‌‌ సంజీవ్‌‌సింగ్ యాదవ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌‌ రాష్ట్ర ప్రతినిధి

స్పేర్‌‌ పార్ట్స్‌‌, మొబైల్స్‌‌ వస్తలేవు

చైనా నుంచి మొబైల్‌‌ ఫోన్లు, స్పేర్‌‌ పార్టులు దగ్గర దగ్గర నెల రోజుల్నుంచి వస్తలెవ్వు. ఫోన్ల రిపేర్‌‌కు వచ్చేటోళ్లు మాత్రం వస్తనే ఉన్నరు. స్పేర్‌‌ పార్ట్స్‌‌ తక్కువగా ఉన్నయి. వాటి రేట్లు కూడా రెండు, మూడు వందలు పెరిగినయి. ఇప్పుడున్న సెల్‌‌ఫోన్లు ఇంకో వారం పదిరోజులు వస్తయి. అప్పటికీ స్టాక్‌‌ రాకపోతే ఫోన్లు అమ్మే చాన్స్‌‌ లేనట్టే.                                   -రిజు, శివమ్‌‌ మొబైల్స్‌‌, కోఠీ