బిజినెస్డెస్క్, వెలుగు:కరోనా వలన కుటుంబాల ఆర్థిక పరిస్థితులు అధ్వాన్నంగా తయారవుతున్నాయి. ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ లేనివారికి కరోనా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. పర్సనల్ లోన్లు తీసుకొని అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రతి నెల ఈఎంఐ కట్టడం కంటే ఏడాదికి ఒకసారి ప్రీమియం కట్టడం మేలని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఉదాహరణకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజి ఉండడంతో హైదరాబాద్లోని ఓ ఉద్యోగి కేవలం రూ. 20 వేల హాస్పిటల్ బిల్లుతో బయటపడగలిగాడు. అదే ఇన్సూరెన్స్ లేకపోయి ఉంటే ఆయనకు అయిన హాస్పిటల్ బిల్లు రూ. 2.20 లక్షలను కట్టడానికి లోన్ తీసుకోవాల్సి వచ్చేది. ఈ లోన్ తీర్చడానికి రూ. 6,500 ఈఎంఐ కట్టినా సుమారు నాలుగేళ్లు పట్టేది. అదే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండడం వల్ల హాస్పిటల్ బిల్లులో సుమారు రూ. 1.90 లక్షల కవర్ అయ్యింది. ఇన్సూరెన్స్ కంపెనీలు హాస్పిటల్ ఖర్చులో 90 శాతాన్ని చెల్లిస్తున్నాయని స్టార్ హెల్త్ ఎండీ ఎస్ ప్రకాశ్ అన్నారు. ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఖర్చుల్లో 50 శాతాన్ని పే చేస్తున్నాయని తెలిపారు. ‘ఇన్సూరెన్స్ ప్రీమియంపై ట్యాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు. కంటిన్యూ పాలసీ అయితే చాలా బెనిఫిట్స్ అందుతాయి. ప్రస్తుతం ఎక్కువ మంది పాలసీలను తీసుకోవడం చూస్తున్నాం’ అని పేర్కొన్నారు. కరోనా వలన గత ఏడాది నుంచి హెల్త్ పాలసీలకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ప్రజల కోసం స్టాండర్డ్ పాలసీలను ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ ఐఆర్డీఏఐ తీసుకొచ్చింది.
హెల్త్ ఇన్సూరెన్స్కి ఫుల్ గిరాకీ
కరోనా కేసులు పెరుగుతుండడంతో గవర్నమెంట్ హాస్పిటల్స్పై ఒత్తిడి పడుతోంది. దీంతో మిడిల్ క్లాస్ ప్రజలు తమ స్తోమతకు మించినా ప్రైవేట్ హాస్పిటల్స్లలో జాయిన్ అవుతున్నారు. కుటుంబంలో మిగిలిన వారికి కరోనా వస్తే హాస్పిటల్ ఖర్చులు మరింత పెరుగుతున్నాయి. కొన్ని కంపెనీలు కరోనా దెబ్బకు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మరికొన్ని శాలరీలో కోత పెడుతున్నాయి. దీంతో ఉద్యోగులు అటు కంపెనీలు ఆఫర్ చేసే హెల్త్ పాలసీలను పొందలేకపోతున్నారు. శాలరీ అందక ఆర్థికంగా చితికిపోతున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్లకు డిమాండ్ పెరుగుతోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కానీ, ఇంకా ఇన్సూరెన్స్ లేని వారు చాలా మంది ఉన్నారని అంటున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత అవసరమో ప్రస్తుతం తెలుస్తోందని ఎనలిస్టులు చెబుతున్నారు. ప్రస్తుత కరోనా సమయంలో ప్రొటెక్షన్ అవసరమని కస్టమర్లలో అవగాహన పెరిగిందని ఇన్సూరెన్స్ అగ్రిగేటర్ ఇన్సూరెన్స్దేఖో సీఈఓ అంకిత్ అగర్వాల్ అన్నారు. జనరల్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ రూపురేఖలను కరోనా మార్చేసిందని చెప్పారు. ప్రస్తుతం మోటర్ ఇన్సూరెన్స్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ ఎక్కువగా ఉందని అన్నారు. తక్కువ ఖర్చులోనే బెనిఫిట్స్ అందించే కరోనా కవచ్ పాలసీని ఇప్పటి వరకు కోటి మంది తీసుకోవడం గమనార్హం.
చెక్ బౌన్స్లు పెరిగాయి..
బారోవర్లు ఈఎంఐలను చెల్లించలేకపోతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో ఈఎంఐలు మిస్ అవ్వడం పెరిగిందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్(ఎన్పీసీఐ) పేర్కొంది. ఈ ఏడాది మార్చి వరకు రీపేమెంట్ ట్రెండ్ రికవరీ బాటలో ఉండేదని, కరోనా సెకెండ్ వేవ్తో బాకీలు చెల్లించడం మళ్లీ పడుతోందని తెలిపింది. చెక్ బౌన్స్లు ఏప్రిల్లో పెరిగాయి. దీనికి ముఖ్య కారణం బ్యాంక్ అకౌంట్లలో సరిపడినంత బ్యాలెన్స్ లేకపోవడమే. ఆటో డెబిట్ ట్రాన్సాక్షన్లలో 34.1% ట్రాన్సాక్షన్లు ఏప్రిల్లో ఫెయిల్ అయ్యాయి. ఇటువంటి ట్రాన్సాక్షన్లు మార్చిలో 32.8 శాతంగా ఉన్నాయి. వాల్యూ పరంగా చూస్తే ఫెయిల్ అయిన ట్రాన్సాక్షన్లు ఏప్రిల్లో 27.9 శాతంగా ఉన్నాయి.
పాలసీ ఉన్నా అడ్వాన్స్ కట్టమంటున్నారు..
ఇన్సూరెన్స్ కవరేజి ఉందని చెబుతున్నా కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ కరోనా పేషెంట్ల నుంచి ముందే అడ్వాన్స్లను కట్టించుకుంటున్నాయి. క్లయిమ్స్ సెటిలవ్వడానికి టైమ్ పడుతుండడంతో ఇలా చేస్తున్నాయి. క్లయిమ్ డబ్బులు అందాక, పేషెంట్ కట్టిన అడ్వాన్స్లను రిలీజ్ చేస్తున్నాయి. ప్రస్తుతం కరోనా క్లయిమ్స్ బాగా పెరిగాయి. దీంతో ఇన్సూరెన్స్లను సెటిల్ చేయడానికి కంపెనీలకు కనీసం నెలన్నర వరకు టైమ్ పడుతోంది.