- ఎస్జీటీఎఫ్ను అందుబాటులోకి తేవాలన్న రాష్ట్ర హెల్త్ ఆఫీసర్లు
- కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య గ్యాప్ తగ్గించాలని కేంద్రానికి విజ్ఞప్తి
- హైరిస్క్ గ్రూపు జనాలకు బూస్టర్ డోసు ఇవ్వాలని వినతి
హైదరాబాద్, వెలుగు: పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ వేగంగా వ్యాప్తిస్తున్నందున జీనోమ్ సీక్వెన్సింగ్కు ప్రాముఖ్యత పెరిగింది. ఇతర దేశాల నుంచి వచ్చే వారికి ఎయిర్పోర్టులోనే కరోనా టెస్టులు చేయాలని, పాజిటివ్గా తేలిన వారి శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించాలని రాష్ట్ర హెల్త్ ఆఫీసర్లు నిర్ణయించారు. ఎక్కువ మొత్తంలో శాంపిల్స్ను సీక్వెన్సింగ్ చేయడం ఖర్చుతో కూడిన వ్యవహారమని, టైమ్ టేకింగ్ ప్రాసెస్ అని చెబుతున్నారు. దీంతో యాంటిజెన్ టెస్ట్ తరహాలో స్పాట్లో జీనోమ్ సీక్వెన్సింగ్ను నిర్ధారించే ఎస్జీటీఎఫ్(ఎస్జీన్ టార్గెట్ ఫెయిల్యూర్) టెస్టింగ్ ఫెసిలిటీని ఎయిర్పోర్టులో అందుబాటులోకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ టెస్టును జీనోమ్ సీక్వెన్సింగ్లో ప్రైమరీ టెస్ట్గా భావిస్తారు. ప్రస్తుతం కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే ఈ టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఎస్జీటీఎఫ్ అంశాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ దృష్టికి తీసుకుపోనున్నట్టు రాష్ట్ర హెల్త్ ఆఫీసర్లు తెలిపారు. కేంద్రం కిట్లు తెప్పించి, రాష్ట్రాలకు సరఫరా చేస్తే కొత్త వేరియంట్లను గుర్తించడం ఈజీ అవుతుందని ఉన్నతాధికారి ఒకరు ‘వీ6 వెలుగు’కు చెప్పారు.
ఇంకా 30 లక్షల మంది వ్యాక్సిన్ వేసుకోలే
కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తిస్తున్నందున రాష్ట్రంలో వ్యాక్సినేషన్ స్పీడప్పై హెల్త్ డిపార్ట్మెంట్ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం సగటున రోజూ రెండున్నర లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తున్నామని, టీకాలు, సిబ్బంది అందుబాటులో ఉన్నా.. జనాలు వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకొస్తలేరని ఆఫీసర్లు చెబుతున్నారు. రాష్ట్రంలో సుమారు 25 లక్షల మందికి ఫస్ట్ డోస్ గడువు ముగిసినా, రెండో డోసు వేయించుకునేందుకు రావడం లేదని చెప్తున్నారు. దీంతో కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య ఉన్న గ్యాప్ను తగ్గించే అంశంపై ఆఫీసర్లు దృష్టి పెట్టారు. కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య గ్యాప్ 84 రోజులు ఉండగా, దీన్ని 42 రోజులకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని గతంలో రాష్ట్రం కోరింది. మరోసారి ఈ అంశాన్ని కేంద్రం వద్ద ప్రస్తావించాలని ఆఫీసర్లు ప్రభుత్వానికి సూచించారు. ఇతర దేశాల తరహాలో హైరిస్క్ గ్రూపు జనాలకు బూస్టర్ డోసు వేసే అంశాన్ని కూడా పరిశీలించాలని కోరనున్నారు. ఆదివారం డబ్ల్యూహెచ్వో రాష్ట్ర ప్రతినిధులతో స్టేట్ హెల్త్ ఆఫీసర్లు ఈ అంశంపై చర్చించారు. రాష్ట్రంలో మొత్తం 2.77 కోట్ల మంది వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉండగా, సుమారు 30.5 లక్షల మంది కనీసం ఒక్క డోసు కూడా వేయించుకోలేదు. కాగా, 1.25 కోట్ల మంది రెండు డోసులు, 1.22 కోట్ల మంది సింగిల్ డోసు తీసుకున్నారు.