కరోనా ఎఫెక్ట్..తగ్గిన ఎంసెట్ అప్లికేషన్లు

కరోనా ఎఫెక్ట్..తగ్గిన ఎంసెట్ అప్లికేషన్లు

హైదరాబాద్, వెలుగు: కరోనా వ్యాప్తి, లాక్​డౌన్​ ప్రభావం అన్ని ఎంట్రెన్స్​ ఎగ్జామ్స్ పై పడింది. ఇప్పటికే ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా పడగా, అప్లికేషన్లు భారీగా తగ్గాయి. ఎంసెట్,​ ఈసెట్, పీజీఈసెట్, ఎడ్​సెట్, పీఈసెట్, లాసెట్​తోపాటు మిగిలిన ప్రవేశ పరీక్షలకు గతేడాది కంటే తక్కువ దరఖాస్తులే వచ్చాయి. ఎంసెట్ కు (ఇంజినీరింగ్, అగ్రికల్చర్) గతేడాది 2,17,799 అప్లికేషన్లొస్తే, ఈసారి ఇప్పటి వరకూ 1,90,141 దరఖాస్తులే వచ్చాయి. ఇంజినీరింగ్​విభాగంలో గతేడాది 1,42,210 అప్లికేషన్లు రాగా, ఈసారి 1,23,377, అగ్రికల్చర్, ఫార్మసీలో గతేడాది 74,989 దరఖాస్తులు వస్తే, ఈసారి 66,764 వచ్చాయి. ఈసెట్​కు లాస్ట్ ఇయర్ 28,241 మంది అప్లై చేయగా, ఈసారి 24,800 మందే దరఖాస్తు చేశారు. పీఈసెట్​కు గతేడాది 5,707 అప్లికేషన్లు వస్తే, ఈసారి 3,500 వరకూ వచ్చాయి. ఎడ్​సెట్ కు గతేడాది 52,380 దరఖాస్తులు రాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 21,131 మంది అప్లై చేశారు. పీజీఈసెట్ కు కిందటి సంవత్సరం 20,455 దరఖాస్తులు అందగా, ఈసారి ఇప్పటి వరకు5,792 అప్లికేషన్లు అందాయి. లాసెట్​కు గతేడాది కంటే 10,914 దరఖాస్తులు తగ్గాయి.

లాక్​డౌన్​ వల్లే తగ్గాయి: సెట్స్​ కన్వీనర్లు

పీజీలాసెట్, ఐసెట్ ​కూడా గతేడాదితో పోలిస్తే అప్లై చేసిన వారి సంఖ్య తగ్గింది. లాక్ డౌన్ వల్ల స్టూడెంట్లు ఇంట్లోంచి బయటకొచ్చే పరిస్థితి లేదని, ఇంటర్నెట్​ సెంటర్లన్నీ కూడా మూసే ఉన్నాయని, అందువల్లే దరఖాస్తులు తగ్గినట్టు ఆయా సెట్స్ కన్వీనర్లు చెప్తున్నారు. అన్ని ప్రవేశ పరీక్షలకు మే 5 వరకూ ఎలాంటి ఫైన్​లేకుండా అప్లై చేసుకునేందుకు హయ్యర్​ ఎడ్యుకేషన్​ కౌన్సిల్​ అవకాశమిచ్చింది. మే 7న రాష్ట్ర ప్రభుత్వం లాక్​డౌన్ ఎత్తేస్తే , దరఖాస్తుల సంఖ్య కొంత పెరగొచ్చని అధికారులు భావిస్తున్నారు. డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్స్​ పూర్తి కాకపోవడంతో చాలామంది స్టూడెంట్స్​ ఇంకా అప్లై చేయకపోవచ్చని భావిస్తున్నారు. లాక్​డౌన్​ తర్వాత అప్లై చేసుకునేందుకు డేట్​ను పెంచకపోతే, స్టూడెంట్లు ఫైన్​తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.