దేశంలో కరోనా పేషెంట్ల రికవరీ రేటు క్రమంగా మెరుగుపడుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింటె సెక్రెటరీ లవ్ అగర్వాల్ చెప్పారు. శుక్రవారం ఉదయం 8 గంటల వరకు ఉన్న రిపోర్ట్ ప్రకారం రికవరీ రేటు 41 శాతానికి పెరిగినట్లు తెలిపారు. దేశంలో కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇప్పటి వరకు దేశంలో లక్షా 18 వేల 447 మందికి కరోనా సోకిందని లవ్ అగర్వాల్ చెప్పారు. అందులో 3,583 మంది మరణించారని, మొత్తంగా మరణాల రేటు 3.02కి చేరిందని తెలిపారు. గడిచిన 24 గంటల్లో 3,334 మంది కోలుకోవడంతో.. మొత్తంగా ఇప్పటి వరకు 48,534 మంది డిశ్చార్జ్ అయ్యారన్నారు. ప్రస్తుతం 66,330 మంది ఆస్పత్రుల్లో కరోనాతో చికిత్స పొందుతున్నారని లవ్ అగర్వాల్ చెప్పారు.
27 లక్షలు దాటిన కరోనా టెస్టుల సంఖ్య
దేశంలో కరోనా టెస్టులు భారీగా చేస్తున్నామని, ఇప్పటి వరకు 27 లక్షలకు పైగా శాంపిల్స్ పరీక్షించామని తెలిపారు ఐసీఎంఆర్ సైంటిస్ట్ రామన్ ఆర్ గంగాఖేద్కర్. గడిచిన నాలుగు రోజులుగా వరుసగా ప్రతి రోజూ లక్షకు పైగా పరీక్షలు జరుగుతున్నాయన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు 27,55,714 టెస్టులు చేసినట్లు తెలిపారు.