కంట్రోల్ చేసేందుకు జిల్లాల్లోనూ కరోనా రూమ్స్
చైనా నుంచి వచ్చిన వారిని గుర్తించాలన్న ఆరోగ్య శాఖ
సస్పెక్టెడ్ కేసులను గాంధీకి పంపించాలని ఆదేశం
ఏపీ నుంచి వచ్చిన కేసులకూ గాంధీలోనే టెస్టులు
హైదరాబాద్, వెలుగు: కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలపై ఫోకస్ పెట్టింది. అన్ని జిల్లాల్లోనూ కరోనా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు హెల్త్ డిపార్ట్మెంట్ స్పెషల్ సీఎస్ శాంతికుమారి కలెక్టర్లకు మంగళవారం లేఖ రాశారు. ఈ మధ్య కాలంలో ఎవరైనా చైనా, సమీప దేశాల నుంచి వచ్చారేమో గుర్తించాలని సూచించారు. కరోనా సస్పెక్టెడ్ కేసులుంటే గాంధీ హాస్పిటల్కు పంపాలని ఆదేశించారు. కేరళలో వైరస్ స్ప్రెడ్ కాకుండా అక్కడి ప్రభుత్వం ఇలాంటి చర్యలే చేపట్టడంతో, అదే విధానాన్ని రాష్ట్రంలోనూ ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెంట్రల్ హెల్త్ డిపార్ట్మెంట్ కరోనాపై స్టేట్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఏపీ నుంచి వచ్చే కరోనా సస్పెక్టెడ్ కేసులకు గాంధీ హాస్పిటల్లోనే టెస్టులు చేయాలని ఆదేశించింది. సెంట్రల్ ఆర్డర్స్ మేరకు మంగళవారం నుంచే ఏపీ సస్పెక్టెడ్ కేసులకు టెస్టులు చేస్తున్నామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాల్లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించిందని చెప్పారు. కరోనాకు సంబంధించిన వివరాల కోసం, సందేహలు తీర్చుకునేందుకు హెల్ప్లైన్ నంబర్ 040 24651119 కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.
‘ప్రైవేట్’లో అడ్మిట్ చేసుకోవద్దు
కరోనా లక్షణాలతో వచ్చే వారిని అడ్మిట్ చేసుకోవద్దని ప్రైవేట్ హాస్పిటళ్లను హెల్త్ డిపార్ట్మెంట్ ఆదేశించింది. ఎవరైనా ఆ లక్షణాలతో వస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని, గాంధీ/ఫీవర్ హాస్పిటల్ కు పంపించాలని సూచించింది. జనవరి 15 తర్వాత చైనా నుంచి వచ్చిన వారి వివరాలు మాత్రమే కలెక్ట్ చేశామని, అంతకుముందే ఇండియాకు వచ్చిన వారి వివరాలు సేకరించాలని డీఎం అండ్ హెచ్ వోలను ఆదేశించామని శ్రీనివాసరావు తెలిపారు. వారిలో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే చెప్పాలని సూచించామని తెలిపారు. చైనా నుంచి 42 మంది తెలంగాణకు రాగా.. వుహాన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ స్ర్కీనింగ్ టెస్టులు చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలోనూ కరోనా లక్షణాలుంటే స్క్రీనింగ్ చేస్తామని వెల్లడించారు. కేంద్రం చైనా నుంచి 600 మందిని ఇండియాకు తీసుకురాగా, వారిలో తెలంగాణ వారు ఐదుగురేనని ఆయన చెప్పారు.
21 శాంపిల్స్ నెగెటివ్
కరోనా వైరస్ అనుమానిత లక్షణాలతో గాంధీ హాస్పిటల్ లో నలుగురు వ్యక్తులు అబ్జర్వేషన్ లో ఉన్నారు. దీంతో సస్పెక్టెడ్ కేసుల సంఖ్య 51కి చేరింది. అయితే 26 మందిని ఇంటి దగ్గరే అబ్జర్వేషన్ లో ఉంచారు. మిగతా 25 మందిలో 21 మంది శాంపిల్స్ ను పరీక్షించారు. వీరందరివీ నెగెటివ్ వచ్చినట్లు హెల్త్ ఆఫీసర్లు తెలిపారు. దీంతో వీరిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. మరో నలుగురి రిపోర్టులు రావాల్సి ఉంది. ఏపీ కి చెందిన ఐదుగురిని కూడా ఇంటి దగ్గరే అబ్జర్వేషన్ లో ఉంచామన్నారు.