
చేపలు తినాలన్న కోరిక.. వారందరినీ కరోనా బారినపడేసింది. చేపల వ్యాపారికి కరోనా సోకడంతో.. అతని దగ్గర చేపలు కొన్న వారందరికీ కరోనా సోకింది. తిరువనంతపురానికి 12 కిలోమీటర్ల దూరంలోని పుంథూరా అనే గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వారంలోనే 100కు పైగా కేసులు నమోదుకావడంతో అక్కడ కమాండోలను దింపి కఠినంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అనవసరంగా ఎవరైనా బయటకొస్తే.. క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తామని హెచ్చరిస్తున్నారు. పుంథూరాలో ఒక్కసారిగా కేసులు పెరగడంతో.. ఆరు వైద్య బృందాలు గ్రామానికి చేరుకొని అక్కడి వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
గ్రామంలో మొదటగా ఒక చేపల వ్యాపారికి కరోనా సోకింది. ఆయన ద్వారా కాంటాక్ట్ ట్రేసింగ్ చేసి.. దాదాపు 600 మందికి పరీక్షలు నిర్వహించారు. వారిలో 119 మందికి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఇంకా మరికొంత మంది ఫలితాలు రావాల్సి ఉంది. చేపల వ్యాపారి నుంచి 119 మందికి వైరస్ సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇంకా ఎన్ని కేసులు తేలుతాయోనని ఆందోళన చెందుతున్నారు. మత్స్యకారులు చేపల విక్రయాలకు వెళ్లొద్దని కలెక్టర్ నవజోత్ ఖోసా ఆదేశించారు. పుంథూరా గ్రామాన్ని మొత్తం శానిటైజ్ చేయాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. గత 24 గంటల్లో కేరళలో 301 కేసులు నమోదయ్యాయి. వాటిలో ఎక్కువగా పుంథూరా, తిరువనంతపురం ప్రాంతాలకు చెందిన కేసులే ఎక్కువగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
For More News..