
వరంగల్ అర్బన్ : చైనాలో పుట్టిన కరోనా వైరస్ రోజుల వ్యవధిలోనే ఇతర దేశాలకు, ఆ తర్వాత రాష్ట్రాలకు, జిల్లాలకు విస్తరించడంతో జనమంతా భయంతో అల్లాడిపోతున్నారు. రాష్ట్ర యంత్రాంగం ప్రజలు భయబ్రాంతులకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని ఈ వైరస్ పై ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. అయితే శనివారం వరంగల్ జిల్లాలోని కాజీపేట రైల్వేస్టేషన్ లో కూడా ఈ కరోనా వైరస్ కారణంగా కలకలం రేగింది.
రాజధాని ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో ఇద్దరు వ్యక్తుల చేతులపై హోమ్ క్వారెంటైన్ స్టాంపును గమనించిన టీసీ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. కారణం.. కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్న వారికి ఐసోలేషన్లో చికిత్స చేసినట్లుగా ఈ ముద్ర వేస్తారు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు రాజధాని ఎక్స్ ప్రెస్ లో B3 బోగీలో గమనించిన టీసిీ వారి చేతుల మీదున్న స్టాంప్ ముద్రలు చూసి వ్రశ్నించారు. వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో వెంటనే అలర్ట్ అయి పై అధికారులకు సమాచారమిచ్చారు. వారిద్దరు సికింద్రాబాద్ నుంచి నిజాముద్దీన్ కు ప్రయాణిస్తున్న పూజా యాదవ్, రోహిత్ కుమార్ లుగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని వెంటనే 108 వాహనం ద్వారా వరంగల్ లోని MGM (గాంధీ) ఆసుపత్రికి తరలించారు. దీంతో బీ 3 బోగీలో ఉన్న వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
వైద్యాధికారులు స్టేషన్ కు చేరుకుని వారు ప్రయాణించిన బోగిలో శానిటైజర్ తో స్త్ర్పే చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన ఈ ఇద్దరికీ స్క్రీనింగ్ టెస్టులు చేశారు అధికారులు. కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో క్వారంటైన్ లో ఉంచాలని సూచించారు. కానీ ఎలా బయటకు వచ్చారో గానీ,నేరుగా రాజధాని ఎక్స్ ప్రెస్లో ప్రయాణించడం కలకలం రేపింది. ఈ ఘటనతో రాజధాని ఎక్స్ ప్రెస్ సుమారు గంట సేపు కాజీపేట లోనే నిలిచిపోయింది.