
చంఢీఘర్: పాకిస్థాన్ గూఢచారిగా పని చేస్తున్నాడని ఆరోపణలపై మరో యూట్యూబర్ అరెస్ట్ అయ్యాడు. పాక్ ఐఎస్ఐతో సత్సంబంధాలు కలిగిన యూట్యూబర్, కంటెంట్ క్రియేటర్ జస్బీర్ సింగ్ను బుధవారం (జూన్ 4) అరెస్ట్ చేసినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. జాన్ మహల్ పేరుతో యూట్యూబ్ ఛానెల్ను నిర్వహిస్తున్న జస్బీర్ సింగ్ ఛానెల్కు 1.1 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారని అధికారులు వెల్లడించారు.
పంజాబ్లోని రూప్నగర్ జిల్లా మహ్లాన్ గ్రామానికి చెందిన జస్బీర్ సింగ్ను మొహాలీలోని స్టేట్ స్పెషల్ ఆపరేషన్స్ సెల్ (SSOC) ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. పాక్ స్పైగా పని చేస్తోందన్న ఆరోపణలపై ఇటీవల హర్యానాకు చెందిన యూట్యూబర్, కంటెంట్ క్రియేటర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జ్యోతి మల్హోత్రాతో జస్బీర్ సింగ్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. వీరిద్దరూ నిత్యం టచ్లో ఉన్నారని గుర్తించారు.
పంజాబ్ పోలీసుల కథనం ప్రకారం.. జస్బీర్ సింగ్ పాకిస్తాన్ నిఘా అధికారి షకీర్ అలియాస్ జుట్ రాంధావాతో దగ్గరి సంబంధం కలిగి ఉన్నాడని తెలిపారు. షకీర్ అలియాస్ జుట్ రాంధావా పాక్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) కోసం పని చేస్తోన్న భారత సంతతికి చెందిన వ్యక్తి. అంతేకాకుండా గూఢచర్యం ఆరోపణలతో భారత్ బహిష్కరించిన పాకిస్తాన్ జాతీయుడు, ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ మాజీ అధికారి ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్తో కూడా జస్బీర్ సింగ్ సంబంధాలు కొనసాగించాడని పోలీసులు వెల్లడించారు.
డానిష్ ఆహ్వానం మేరకు ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో జరిగిన పాకిస్తాన్ జాతీయ దినోత్సవ వేడుకలకు కూడా జస్బీర్ హాజరయ్యాడని.. అక్కడ పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది, పాక్ వ్లాగర్లతో మాట్లాడని పేర్కొన్నారు. 2020, 2021, 2024లో మొత్తం మూడుసార్లు జస్బీర్ సింగ్ పాకిస్తాన్కు వెళ్లి వచ్చాడని చెప్పారు. జస్బీర్ ఫోన్, ల్యాప్ ట్యాప్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల ఫోరెన్సిక్ విశ్లేషణలో పాకిస్తాన్కు చెందిన అనేక కాంటాక్ట్ నంబర్లు బయటపడ్డాయని.. ఆ నెంబర్లు ఎవరివి అనే దానిపై ఆరా తీస్తున్నామని తెలిపారు.
జ్యోతి మల్హోత్రా అరెస్టు తర్వాత ఐఎస్ఐ -సంబంధిత కార్యకర్తలతో జరిపిన సంభాషణ ఆనవాళ్లను తొలగించడానికి జస్బీర్ ప్రయత్నించాడని ఆరోపించారు. గూఢచర్యం, ఉగ్రవాద నెట్వర్క్ గుట్టు రట్టు చేయడానికి.. ఇందులో వ్యక్తులందరినీ గుర్తించడానికి ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని పంజాబ్ పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై పంజాబ్ పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు.