11 వందల కేజీల బాంబుతో రష్యాలో బ్రిడ్జిని పేల్చేశాం: ఉక్రెయిన్ ప్రకటన

11 వందల కేజీల బాంబుతో రష్యాలో  బ్రిడ్జిని పేల్చేశాం: ఉక్రెయిన్ ప్రకటన

రష్యా - ఉక్రెయిన్ యుద్ధం తీవ్రరూపం దాల్చుతూనే ఉంది. ఏండ్లు దాటిపోతున్నా యుద్ధాన్ని ఆపడం లేదు రెండు దేశాలు. చిన్న దేశమైన ఉక్రెయిన్ ను భయపెట్టుకుందా అనుకున్న రష్యాకు ఉక్రెయిన్ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. నిన్న కాక మొన్న రష్యాపై  డ్రోన్స్ తో విరుచుకుపడి ఊహించని షాక్ ఇచ్చిన ఉక్రెయిన్.. మంగళవారం (జూన్ 3) రష్యాలోని కీలక బ్రిడ్జిని కూల్చేసినట్లు ప్రకటించింది. 

1100 కిలోల పేలుడు పదార్థంతో ఇవాళ (జూన్ 3) ఉదయం రష్యాలోని రోడ్డు, రైలు బ్రిడ్జ్ ను పేల్చేసినట్లు ప్రకటించింది. 19 కిలోమీటర్ల పొడవున్న క్రిమియా బ్రిడ్జిని అండర్ వాటర్ లో పిల్లర్లను టార్గెట్ చేస్తూ పేల్చేసినట్లు చెప్పింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో బ్రిడ్జి పేలడంతో నీళ్లతో పాటు పిల్లర్లు గాల్లోకి ఎగిరిపడ్డాయి. 

‘2022, 2023లో కూడా క్రిమియా బ్రిడ్జిని పేల్చేశామని.. ఇవాళ కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అండర్ వాటర్ బాంబుతో పేల్చేశామని ప్రకటించాయి ఉక్రెయిన్ సెక్యూరిటీ బలగాలు. ఈ ఆపరేషన్ ను గత కొన్ని నెలలుగా ప్లాన్ చేస్తూ.. ఇవాళ అమలు చేసినట్లు ప్రకటించారు. 

దీనికి సంబంధించి వీడియో ఫుటేజ్ రిలీజ్ చేసింది ఉక్రెయిన్ సెక్యూరిటీ ఫోర్స్. అండర్  వాటర్ లో పేలుడు జరగటంతో పిల్లర్ గాల్లోకి ఎగిరి పడింది. అయితే ఇవాళ ఉదయం 4 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో బ్రిడ్జిని మూసేశారు రష్యా అధికారులు. ఎందుకు మూసేశారో కారణం చెప్పలేదు. అయితే బ్రిడ్జిని రీ-ఓపెన్ చేశామని.. రాకపోకలు జరుగుతున్నాయని రష్యా ప్రకటించింది. 

క్రిమియా బ్రిడ్జిని ఉక్రెయిన్ వరుసగా పేల్చేస్తుండటానికి గల కారణం.. రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో ఇరు దేశాల మధ్య ఉంది. రష్యా దళాలు ఆ బ్రిడ్జిపై నుంచే ఉక్రెయిన్ భూభాగంలోకి వెళ్లి దాడులు చేస్తున్నాయి. 2022 ఫిబ్రవరిలో ఈ యుద్ధం మొదలవ్వగా.. అప్పటి నుంచి రష్యాకు బలంగా మారింది ఈ బ్రిడ్జి. దీంతో ఇప్పటికే రెండు సార్లు పేల్చేసిన ఉక్రెయిన్.. మంగళవారం మరోసారి పేల్చేయడం గమనార్హం.