- సెకండ్ డోస్కూ తప్పనిసరి: హెల్త్ డిపార్ట్మెంట్
- కొవిన్ పోర్టల్లో కనిపించని టీకా కేంద్రాల వివరాలు
- ఉన్న కొన్ని సెంటర్లలోనూ వంద మందికే చాన్స్
- సెకండ్ డోస్ వాళ్లకే ప్రయారిటీ ఇవ్వాలన్న హెల్త్ డైరెక్టర్
- నిన్న 25 వేల మందికే వ్యాక్సిన్
- చాలా జిల్లాల్లో వ్యాక్సినేషన్ చేయని అధికారులు
- 4 రోజులకు సరిపడా డోసులు
- మరిన్ని వస్తాయన్న ఆఫీసర్లు
హైదరాబాద్, వెలుగు: కొవిన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని, స్లాట్ బుక్ చేసుకున్నోళ్లకు మాత్రమే కరోనా వ్యాక్సిన్ వేస్తామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు ప్రకటించారు. స్లాట్ బుక్ చేసుకోకుండా డైరెక్ట్గా సెంటర్ల వద్దకు వస్తే వ్యాక్సిన్ ఇవ్వబోమన్నారు. సెకండ్ డోస్ వేసుకునేటోళ్లు కూడా ముందే స్లాట్ బుక్ చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. కొవిన్ పోర్టల్ https://selfregistration.cowin.gov.in/ లో వ్యాక్సినేషన్ సెంటర్లు, అందుబాటులో ఉన్న స్లాట్ల వివరాలను అప్లోడ్ చేశామని చెప్పారు. టీకా కేంద్రాల వద్ద జనాలు గుమిగూడుతున్నారని, ఆ రష్ను తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ఫోన్లోనే రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చన్నారు. ఆ అవకాశం లేనివాళ్లు మీసేవ సెంటర్లలోనూ చేసుకోవచ్చని చెప్పారు. వృద్దులు, పెద్దగా చదువుకోని కుటుంబ సభ్యులకు యువత సాయం చేయాలని కోరారు.
జనాల్లో గందరగోళం
ముందుగానే రిజిస్ర్టేషన్ చేసుకున్నా, చేసుకోకపోయినా ఇన్నాళ్లూ వ్యాక్సిన్ వేశారు. కానీ, ఇప్పుడు సడన్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే వ్యాక్సిన్ వేస్తామని ప్రకటించడంతో జనాల్లో కొంత గందరగోళం నెలకొంది. దీనికి తోడు చాలా చోట్ల సెంటర్లు ఉన్నా సోమవారం సాయంత్రం వరకూ అవి కొవిన్ పోర్టల్లో కనిపించలేదు. కొన్ని సెంటర్లను చూపించినా ఒక్కో సెంటర్లో కేవలం వంద స్లాట్లనే అందుబాటులో ఉంచారు. ఈ లెక్కన మంగళవారం నుంచి ఒక్కో సెంటర్లో వంద మందికే వ్యాక్సిన్ వేసే సూచనలు కనిపిస్తున్నాయి. సెకండ్ డోస్ వాళ్లకూ ముందస్తు బుకింగ్ తప్పనిసరి చేయడంతో మరింత ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. స్లాట్లన్నింటినీ ఫస్ట్ డోస్ వాళ్లే బుక్ చేసుకుంటే సెకండ్ డోస్ వారి పరిస్థితేంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నెలాఖరు నాటికి 7.69 లక్షల మంది కొవిషీల్డ్, 3.43 లక్షల మంది కొవాగ్జిన్ సెకండ్ డోస్ తీసుకోవాల్సి ఉందని శ్రీనివాసరావు చెప్పారు. సెకండ్ డోస్ వాళ్లకే ముందుగా టీకా వేయాల్సిందిగా సెంటర్లకు సూచించామన్నారు. అవసరమైతే, సెకండ్ డోసు వాళ్ల కోసం ప్రత్యేకంగా ఒకట్రెండు రోజులు కేటాయిస్తామని చెప్పారు.
చాలా జిల్లాల్లో వెయ్యలె
రాష్ర్టంలో సోమవారం వ్యాక్సినేషన్ అంతంతమాత్రంగానే సాగింది. ఇప్పటిదాకా సగటున రోజూ లక్షన్నర మందికి టీకాలు వేయగా.. సోమవారం 25,284 మందికి మాత్రమే వ్యాక్సిన్ వేశారు. నాగర్కర్నూల్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సూర్యాపేట, ములుగు జిల్లాల్లో అసలు వ్యాక్సినేషన్ జరగనేలేదు. మిగిలిన జిల్లాల్లో కొన్ని సెంటర్లలో మాత్రమే టీకాలు వేశారు. శని, ఆదివారాల్లో వ్యాక్సినేషన్ లేదని ప్రకటించిన హెల్త్ డిపార్ట్మెంట్, సోమవారం నాటి పరిస్థితిపై ఎలాంటి సమచారమూ ఇవ్వలేదు. దీంతో చాలా మంది జనాలు వ్యాక్సిన్ కోసం ఉదయం 7 గంటల నుంచే సెంటర్ల వద్ద క్యూ కట్టారు. ఉన్నతాధికారుల నుంచి సమాచారం లేకపోవడంతో వ్యాక్సినేషన్ నిర్వహించేందుకు మెడికల్ ఆఫీసర్లు ఇబ్బందిపడ్డారు. జనాల తాకిడి తట్టుకోలేక వ్యాక్సిన్లు వేయట్లేదని జిల్లా కలెక్టర్లు, ఆఫీసర్లు ప్రకటించేశారు. ఉదయం తొమ్మిదిన్నర తర్వాత అన్ని ప్రభుత్వ సెంటర్లలో వ్యాక్సినేషన్ ఉందంటూ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ప్రకటన విడుదల చేసినా.. అప్పటికే జనాలు వెళ్లిపోయారు. ఆఫీసర్లూ లైట్ తీసుకున్నారు.
4 లక్షల డోసులొచ్చినయ్
రాష్ట్రానికి మరో 4 లక్షల డోసుల వ్యాక్సిన్లను కేంద్రం పంపించింది. సోమవారం కోఠిలోని వ్యాక్సిన్ స్టోర్కు ఇవి చేరుకున్నాయి. ఇక్కడి నుంచి అన్ని జిల్లాలకూ పంపించారు. మొత్తంగా ఇప్పుడు రాష్ర్టంలో సుమారు 5 లక్షల డోసుల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఇంకో నాలుగు రోజుల వరకూ వ్యాక్సినేషన్కు ఎలాంటి ఇబ్బంది ఉండదని హెల్త్ ఆఫీసర్లు తెలిపారు. ఈలోపల మరిన్ని డోసుల వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందన్నారు.