వాషింగ్టన్: మాయదారి మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగంగా చేస్తున్నాయి. వీలైనంత ఎక్కువ మందికి టీకాలు వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నెల 27 నాటికి ప్రపంచవ్యాప్తంగా 106 కోట్ల 9 లక్షల 17 వేల 21 డోసుల వ్యాక్సిన్లను జనానికి వేశారు. 18 దేశాల్లో కోటికిపైగా డోసులను వేశారు. ఈ జాబితాలో చైనా మొదటి స్థానంలో నిలవగా, అమెరికా, ఇండియాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. చైనాలో ఇప్పటిదాకా 23 కోట్ల 59 లక్షల 76 వేల డోసుల వ్యాక్సిన్లను ప్రజలకు ఇచ్చారు. అయితే, ఏ డోసు ఎంత మందికి ఇచ్చారన్న డేటా మాత్రం అందుబాటులో లేదు. చైనా తర్వాత అమెరికాలో 23 కోట్ల 24 లక్షల 7 వేల 669 డోసుల వ్యాక్సిన్ ఇచ్చారు.
ఆ దేశ జనాభాలో 43 శాతం మందికి మొదటి డోసు వ్యాక్సిన్ వేయగా, 29 శాతం మందికి సెకండ్ డోస్ ఇచ్చారు. మన దేశంలో 14 కోట్ల 48 లక్షల 79 వేల 233 డోసుల వ్యాక్సిన్లను ఇచ్చారు. అందులో 8.9 శాతం మందికి ఫస్ట్ డోస్, 1.7 శాతం మందికి సెకండ్ డోస్ వేశారు.
డబ్బున్న దేశాల్లోనే స్పీడ్గా..
డబ్బున్న దేశాల్లో టీకా కార్యక్రమం దూసుకుపోతుంటే.. డబ్బులేని పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాత్రం స్లోగా సాగుతోంది. వారికి వ్యాక్సిన్లు సరఫరా చేసేవారు లేకపోవడం, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రారంభించిన కొవ్యాక్స్పైనే ఆధారపడుతుండడంతో పేద దేశాల్లో ఎక్కువ మందికి వ్యాక్సిన్లు వేయలేకపోతున్నారు. ముఖ్యంగా ఆఫ్రికా దేశాలు, కొన్ని మిడిల్ఈస్ట్ దేశాల్లో వ్యాక్సినేషన్ చాలా నెమ్మదిగా సాగుతోంది. నైజర్, సౌత్సూడాన్, లిబియా, పపువా న్యూ గినియా, జాంబియా, అర్మేనియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సిరియా, కెమరూన్, కిర్గిస్థాన్ వంటి దేశాల్లో 0.1 శాతం మందికి కూడా వ్యాక్సిన్లు వేయలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కొన్ని దేశాల్లో అసలు మొదలుకాలె
వ్యాక్సినేషన్ తక్కువ జరగడం కాదు.. అసలు వ్యాక్సిన్ కార్యక్రమం మొదలుకాని దేశాలూ ఉన్నాయి. 17 దేశాల్లో ఒక్క డోసు టీకా కూడా పడలేదు. క్యూబా, తుర్కమెనిస్థాన్, బెనిన్, టాంజానియా, నార్త్ కొరియా, కాంగో, చాద్, గినియా బిసౌ, బుర్కినా ఫాసో, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, తజికిస్థాన్, లైబీరియా, బురుండీ, హైతీ, మడగాస్కర్, ఎరిట్రియా, యెమన్లలో వ్యాక్సిన్ వేసిన దాఖలాలు లేవు.