ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు టీకా మన తెలంగాణ నుంచే వస్తుందన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్లో ఉన్న భారత్ బయోటెక్ సంస్థ నుంచే ఆ టీకా వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ సెంటర్ను మంత్రి కేటీఆర్ ఇవాళ(మంగళవారం) సందర్శించారు. భారత్ బయోటెక్ సంస్థ ఉద్యోగుల మంత్రి మాట్లాడారు. ఆ తర్వాత మాట్లాడిన ఆయన …కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీలో భారత్ బయోటెక్ ముందంజంలో ఉండడం గర్వంగా ఉందన్నారు.
కరోనాకు టీకా మొదట హైదరాబాద్ నుంచి, అందులో భారత్ బయోటెక్ నుంచి వస్తుందని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. టీకాల అభివృద్ధి, తయారీలో భారత్ భాగస్వామ్యం కీలకమైందని ప్రపంచదేశాలు పదేపదే చెబుతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ అవసరాల దృష్ట్యా హైదరాబాద్ ప్రాముఖ్యత కూడా పెరిగినట్లు కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ నుంచి మూడవ వంతు వ్యాక్సిన్ ప్రపంచ దేశాలకు అందించడం గర్వంగా ఉందన్నారు. మీ అందరి నిరంతర కృషి కారణంగానే ఇది సాధ్యమవుతోందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ కూడా మంత్రి కేటీఆర్ నిర్వహించిన చర్చలో పాల్గొన్నారు.