
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే లక్షల మంది జనానికి అంటుకుంది. బ్రెజిల్లోని ఓ హాస్పిటల్లో ఓ పక్కన చనిపోయిన కరోనా పేషెంట్ల మృతదేహాలుంటే మరోపక్క కొందరికి డాక్టర్లు, నర్సులు ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్నంతటినీ ఓ నర్సు తీసి వీడియో పోస్టు చేయగా అది కాస్త వైరలైంది. బ్రెజిల్లోని అమెజానస్ రాష్ట్రంలో ఉన్న జొయావో ఎమర్జెన్సీ హాస్పిటల్లో ఈ ఘటన జరిగింది. వీడియో తీసిన టైమ్లో హాస్పిటల్లో 14 శవాలున్నట్టు తెలిసింది. చైనాలో కరోనా పాజిటివ్ వచ్చిన కేసుల్లో 44 శాతం మందికి జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాల్లేని కరోనా పాజిటివ్ వ్యక్తుల నుంచే సోకిందని గ్వాంగ్జౌలోని ప్రభుత్వ ఆస్పత్రి ల్యాబొరేటరీ స్టడీలో తేలింది.
ప్రపంచవ్యాప్తంగా 1.50 లక్షల మరణాలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు 1,50,000 దాటాయి. ఇందులో మూడింట రెండొంతులు (92 వేలు) యూరప్లోనే మరణించారు. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య 22 లక్షలు దాటిపోయింది. కేసులు, మరణాల్లో అమెరికా ముందుంది.
ఇంకొన్ని దేశాల్లో ఇట్లిట్ల
- ఇటలీలో లాక్డౌన్ను ఎత్తేయాలంటూ కొన్ని ప్రాంతాల పాలకులు ప్రభుత్వాన్ని పట్టుబడుతున్నారు. ఇప్పటికే చాలా యూరోపియన్ దేశాలు లాక్డౌన్ను ఎత్తేశాయని, ఇటలీ కూడా దీనిపై ఆలోచించుకోవాలని లొంబార్గీ రీజియన్ హెడ్ అట్టిలో ఫొంటనా కోరారు.
- స్పెయిన్లో కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్నాయి. వైరస్ వ్యాప్తి స్టార్టయినప్పటి నుంచి ఇప్పటివరకు గత 15 రోజుల్లో మరణాలు, కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే గురువారం నాటికి మరణాలు19 వేలు దాటాయి. మరణాల్లో స్పెయిన్ మూడో స్థానంలో ఉంది.
- బెల్జియంలో మరణాల సంఖ్య 5 వేలు దాటింది. ఇందులో సగానికిపైగా మరణాలు ఓల్డేజ్ హోమ్లలో సంభవించాయని అక్కడి అధికారులు చెప్పారు.