ప్రస్తుతం ప్రపంచాన్ని కాల సర్ప దోషం వెంటాడుతోందని, గ్రహ పరిస్థితుల కారణంగా కరోనా కంట్రోల్ కావడం లేదని శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. ఏప్రిల్ 24 నుంచి దుష్ట గ్రహాల ప్రభావం తగ్గుముఖం పడుతుందని, మే 5 తర్వాత ఇది పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంచనా వేశారు. కరోనా వైరస్ ప్రమాదకరమే అయినా భగవంతుని కృపతో ఆ ప్రభావం తగ్గుతుందని, జ్యోతిష్య శాస్త్రాన్ని పరిశీలిస్తే ఈ వైరస్ ప్రభావం సంవత్సరాల తరబడి ఉండదనిపిస్తోందని అన్నారు.
భారతదేశం ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎన్నో చూసిందని, కరోనా గురించి నైరాశ్యం వద్దని పేర్కొన్నారు స్వరూపానందేంద్ర. లాక్ డౌన్ సమయంలో ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలన్నారు. పిల్లల్లో ఆధ్యాత్మిక చింతన పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

