- 230 మంది కరోనా మృతుల్లో
- 120 మంది డయాబెటిస్ పేషెంట్లే
- ఇతర వ్యాధులతో 70 మంది మరణం
- ఏ జబ్బు లేకుండానే కన్నుమూసిన వారు 40 మంది
- స్టేట్లో 26 లక్షల మంది షుగర్, బీపీ రోగులు
హైదరాబాద్, వెలుగు: డయాబెటిస్ పేషెంట్లకు కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరంగా మారింది. ఈ మహమ్మారితో చనిపోతున్న ప్రతి ఇద్దరిలో ఒకరు షుగర్ పేషెంటే. డయాబెటిస్ ఉన్నవాళ్లలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడంతో వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటోంది. బాడీలోని పార్ట్స్పై వైరస్ త్వరగా ఎటాక్ చేస్తోందని, ఇందువల్లే పరిస్థితి విషమించి చనిపోతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. స్టేట్లో గురువారం నాటికి కరోనాతో 230 మంది చనిపోగా, ఇందులో 120 మందికి డయాబెటిస్ ఉంది. వీరిలో 88 మందికి డయాబెటిస్, హైపర్ టెన్షన్ రెండూ ఉండగా, 19 మందికి డయాబెటిస్ మాత్రమే ఉంది. ఇంకొందరికి డయాబెటిస్కు తోడు ఇతర జబ్బులూ ఉన్నయి. ఒకటికి మించి రోగాలు ఉన్నవాళ్లు కరోనా సోకిన నాలుగైదు రోజుల్లోనే క్రిటికల్ పొజిషన్లోకి వెళ్తున్నారు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి ఆక్సిజన్ లెవల్స్ పడిపోతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారు కరోనా విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
26 లక్షల మందికి ముప్పు
హెల్త్ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం స్టేట్లో 5.7 లక్షల మంది డయాబెటిస్, 10.3 లక్షల మంది హైపర్ టెన్షన్ రోగులు ఉన్నారు. కొన్ని జిల్లాల్లో సర్వే పూర్తి కాకపోవడంతో అనధికారికంగా మరో పది లక్షల మంది వరకూ డయాబెటిస్, హైపర్ టెన్షన్ రోగులు హెల్త్ ఆఫీసర్లు చెబుతున్నారు. వీళ్లందరికీ కరోనా ముప్పు ఎక్కువగా ఉంటుందంటున్నరు. అయితే, కరోనా సోకిన డయాబెటిస్ రోగుల్లో చాలా మంది కోలుకుంటున్నారని గాంధీ హాస్పిటల్ డాక్టర్లు వివరించారు. డయాబెటిస్ రోగుల్లోనూ వృద్ధులు, ఒకటికి మించి జబ్బులు ఉన్నవాళ్లలోనే వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోందని అంటున్నారు.
ఇవి కూడా ప్రమాదమే
డయాబెటిస్తో పాటు కేన్సర్, లంగ్, కిడ్నీ డిసీజ్, న్యూరాలజికల్ డిజార్డర్స్ ఉన్నవాళ్లలోనూ కరోనా డెత్ రేట్ ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారిలో 33 మంది ఈ జబ్బులతో బాధపడే వారే. నాన్కమ్యునికబుల్ డిసీజెస్తో బాధపడేవారు లక్షణాలు మొదలైతే, వెంటనే టెస్టులు చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఆలస్యం చేయడం వల్లే చాలా మంది విషయంలో పరిస్థితి చేయిదాటిపోతోందని అంటున్నారు. స్టేట్లో కరోనా కారణంగా చనిపోయిన వారిలో 40 మందికి డయాబెటిస్గానీ, ఇతర రోగాలుగానీ లేవు. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడం, వైరస్ సోకిన తర్వాత హాస్పిటల్కు ఆలస్యంగా వెళ్లడం వంటివే వీరి మరణాలకు కారణాలని డాక్టర్లు వివరిస్తున్నారు. కరోనా తొలుత ఊపిరితిత్తులపై ప్రతాపాన్ని చూపుతోందని, ఇలాంటి వారిలో ఎక్కువగా న్యుమోనియాతో మరణిస్తున్నట్టు చెబుతున్నారు.