
- స్టూడెంట్లపై ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల ఒత్తిడి
- అన్నిరకాల ఫీజులు వసూలు చేసుకోవడంపై దృష్టి
- టెన్త్ స్టూడెంట్లకూ ఇదే పరిస్థితి
- ఎగ్జామ్ ఫీజెంతో నేరుగా చెప్పని ఇంటర్ బోర్డు
- డబుల్ వసూలు చేస్తున్న కాలేజీలు
- ఇబ్బంది పడుతున్నస్టూడెంట్స్, పేరెంట్స్
వార్షిక పరీక్షల ఫీజులు చెల్లించే టైం ముగుస్తుండటంతో కాలేజీలు, స్కూళ్లు స్టూడెంట్లను ఇబ్బంది పెడుతున్నాయి. ట్యూషన్ ఫీజు, ఇతర అన్ని రకాల ఫీజులు పూర్తిగా చెల్లిస్తేనే ఎగ్జామ్ ఫీజు తీసుకుంటామంటున్నాయి. ఎగ్జామ్ ఫీజుల కింద నిర్ణయించిన మొత్తం కన్నా ఎక్కువగా వసూలు చేస్తున్నాయి. దీంతో స్టూడెంట్లు, వారి తల్లిదండ్రులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి కాలేజీలు, స్కూళ్ల పై చర్యలు తీసుకోవాలని స్టూడెంట్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.
లక్షలాది మంది స్టూడెంట్లకు..
రాష్ట్రంలో మొత్తం 2,558 జూనియర్ కాలేజీలు ఉండగా.. 404 సర్కారీ కాలేజీలు, 1,583 ప్రైవేటు,41 ఎయిడెడ్ కాలేజీలు, వివిధ శాఖల పరిధిలోని గురుకులాలు మరో 530 కాలేజీలు ఉన్నాయి. వీటన్నింటిలో కలిపి పది లక్షల మంది స్టూడెంట్లు చదువుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిల్లో జరిగే వార్షిక పరీక్షలకు ఇంటర్ బోర్డు ఫీజులను నిర్ణయించి, గడువు ప్రకటించింది. ఫస్టియర్ , సెకండియర్ స్టూడెంట్స్ కు (అప్లికేషన్ ఫీజుతో కలిపి) పరీక్షా ఫీజు రూ.470 కాగా, ప్రాక్టికల్స్ ఉండే కోర్సుల స్టూడెంట్స్ అదనంగా మరో రూ.180 చెల్లించాలి. ఈనెల నాలుగో తేదీ వరకు ఎలాంటి ఫైన్ లేకుండానే ఈ ఫీజులు చెల్లించవచ్చు. అయితే ప్రైవేటు కాలేజీలు నిర్ణయించిన దాని కంటే డబుల్ ఫీజును వసూలు చేస్తున్నాయి.
ఫీజు ఎంతో చెప్పరా?
వాస్తవానికి ఇంటర్ బోర్డు ఇచ్చిన ఎగ్జా మ్ ఫీజు ప్రకటనలో ఎంత ఫీజు చెల్లించాలన్న వివరాలను ముందుగా ప్రకటించలేదు. కేవలం ఫైన్ లేకుండా ఎప్పటివరకు, ఫైన్ తో ఎప్పటివరకు కట్టాలన్న వివరాలనే విడుదల చేశారు. ఇది ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలకు వరంగా మారింది. చాలా కాలేజీల్లో ఆర్ట్స్ గ్రూపులకు రూ.650 నుంచి రూ.వెయ్యి వరకు, సైన్స్ కోర్సు లకు రూ.700 నుంచి రూ.1,500 వరకు వసూలు చేస్తున్నారు.
అన్ని ఫీజులు కడితేనే..
ఇంటర్ కాలేజీలు వివిధ కోర్సులకు రూ.20 వేల నుంచి రూ.లక్షన్నర వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. రెండు మూడు విడతల్లో ఈ ఫీజులు తీసుకుంటాయి. ఇప్పుడు పరీక్ష ఫీజు టైంను మొత్తం ఫీజుల వసూలుకుడుకుంటున్నాయి. ఫీజులో 70 శాతం చెల్లించినా, కొద్దిరోజుల్లో మిగతా మొత్తం కడతామన్నా కూడా ఎగ్జా మ్ ఫీజు తీసుకోబోమంటూ బెదిరిస్తు న్నాయి. కొన్ని కాలేజీలు ఈ విషయాన్ని నోటీస్ బోర్డుల్లోనూ పెడుతున్నాయి. ఇప్పటికిప్పుడు డబ్బు లు కట్టలేని తల్లిదండ్రులు ఇబ్బందిపడుతున్నారు. టెన్త్ స్టూ డెంట్లకు సంబంధించి కూడా చా లా స్కూళ్లు ఇదే తరహాలో వ్యవహరిస్తు న్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.
కార్పొరేట్ విద్యా సంస్థల్లో ..
ప్రధానంగా కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఈ ఫీజు వ్యవహారం సాగుతోంది. అన్ని ఫీజులు కట్టేయాలని మేనేజ్ మెంట్లు స్టూడెంట్లు , వారి తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇంటర్ ఫస్టియర్ లో అన్ని గ్రూపుల స్టూడెంట్స్ కు పరీక్ష ఫీజు రూ.850, సెకండియర్ సైన్స్ స్టూడెంట్స్ కు రూ.850, ఫస్టియర్ బ్యాక్ లాగ్ ఉంటే రూ.1,300, ఆర్ట్స్ స్టూ డెంట్స్ కు 650, ఫస్టియర్ బ్యాక్ లాగ్ ఉంటే రూ.1,100 ఫీజులు వెంటనే కట్టాలి .అన్నిరకాల ఫీజులు చెల్లించిన తర్వాతే ఎగ్జామ్ ఫీజులు తీసుకోబడును.. అంటూ ఓ విద్యాసంస్థ పరిధిలోని అన్ని కాలేజీలకు సర్క్యులర్ పంపడం గమనార్హం.ఇందులో అన్ని ఫీజులు చెల్లిస్తేనే ఎగ్జా మ్ ఫీజు తీసుకుంటామనడం ఒకటైతే.. పరీక్ష ఫీజులు సుమారు రెండింతలు వసూలు చేయడం మరో అంశం. దీని పై స్టూడెంట్ల తల్లిదండ్రులు మండిపడ్డుతున్నారు.