
- జులై 14న 29 వేల రేషన్కార్డులు పంపిణీ
- 9 సర్కిళ్ల పరిధిలో ఇవ్వనున్న సివిల్ సప్లయీస్ శాఖ
- 2.5 లక్షల దరఖాస్తులు వచ్చాయన్న అధికారులు
- రోజూ కొత్తగా 6 వేల అప్లికేషన్లు
- వెరిఫికేషన్ వేగవంతానికి మిగతా శాఖల నుంచి సిబ్బంది
హైదరాబాద్సిటీ, వెలుగు: కొత్త రేషన్ కార్డుల కోసం గ్రేటర్ పరిధిలోని లక్షల మంది ఆతృతతో ఎదురుచూస్తుండడంతో ఈనెల14న కొత్త కార్డుల పంపిణీకి అధికారుల ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని 9 సర్కిళ్ల పరిధిలో 29,487 మందికి కార్డుల పంపిణీ చేస్తున్నామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్ వెల్లడించారు. అయితే, 14వ తేదీన ఇచ్చే కార్డులు వెరిఫికేషన్పూర్తయినవి మాత్రమేనని, దరఖాస్తులు, వెరిఫికేషన్, పంపిణీ అనేది నిరంతర ప్రక్రియగా ఉంటుందని తెలిపారు. కార్డులు పొందిన వారికి సెప్టెంబర్నుంచి సరుకుల పంపిణీ ఉంటుందన్నారు. హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మేడ్చల్మల్కాజిగిరి జిల్లాల్లో కూడా కార్డుల పంపిణీ ఉంటుందన్నారు.
ఏడాదిలో లక్ష కొత్త కార్డులు
ఇప్పటి వరకు ఒక్క హైదరాబాద్ పరిధిలోనే 2.5 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. రేషన్కార్డుల దరఖాస్తుల స్వీకరణ నిరంతరం ఉంటుందని ప్రకటించడంతో రోజుకు దాదాపు 5 వేల నుంచి 6 వేల దరఖాస్తులు మీసేవా కేంద్రాల్లో నమోదవుతున్నాయంటున్నారు. ఇలా వచ్చిన దరఖాస్తులను సర్కిళ్ల వారీగా ఏఎస్ఓలు పరిశీలించి వెరిఫికేషన్ పనులను ఆర్ఐలకు అప్పగిస్తున్నారు. వారు దరఖాస్తుదారులు పేర్కొన్న చిరునామాలకు వెళ్లి ఇచ్చిన వివరాలు సరిగ్గా ఉన్నాయా? లేదా? కార్డు ఇవ్వడానికి అర్హులేనా? కాదా అన్నవిషయాలను పరిశీలించి ఏఎస్ఓకు నివేదిక ఇస్తున్నారు. ఏఎస్వోలు డీఎస్ఓకు రిపోర్ట్ఇస్తారు. తర్వాత ఆ కార్డులకు చీఫ్ రేషనింగ్ఆఫీసర్( సీఆర్ఓ) ఆమోదం తెలుపుతారు. ప్రస్తుతం హైదరాబాద్నగరంలోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో 6,39,451 కార్డులున్నాయి. మరో ఏడాదిలో లక్షకు పైగానే కొత్త కార్డులు ఇస్తామని అధికారులు చెప్తున్నారు.
సిబ్బంది కొరత కారణంగా ఆలస్యం
నగరంలోని 9 సర్కిళ్ల పరిధిలో కొత్త రేషన్కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించడానికి పౌరసరఫరాల శాఖకు అవసరమైన సిబ్బంది లేక ఇబ్బంది పడుతున్నారు. రోజుకు వేలల్లో దరఖాస్తులు వస్తున్నా వెరిఫికేషన్ చేసేందుకు అవసరమైన సిబ్బంది లేరని, అందుకే ఆలస్యమవుతోందంటున్నారు. దీంతో వెరిఫికేషన్పనులకు కొందరు ఆఫీసర్లను ఇవ్వాల్సిందిగా బల్దియా, రెవెన్యూ శాఖలకు లెటర్లు రాశారు.
వారు ఈ నెలాఖరులో వచ్చే అవకాశం ఉండడంతో పని స్పీడప్చేస్తామంటున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన రెండున్నర లక్షల దరఖాస్తుల్లో 10శాతం మాత్రమే వెరిఫికేషన్ పూర్తయ్యిందంటున్నారు. మరో రెండు నెలలు రేషన్పంపిణీ లేనందున పూర్తిగా కొత్త దరఖాస్తుల వెరిఫికేషన్పైనే దృష్టి పెడతామంటున్నారు.