
హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ హక్కులను ఎవ్వరికీ తాకట్టు పెట్టమని.. ఎంతటి వారొచ్చినా నిటారుగా నిలబడి కొట్లాడుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ నీటి హక్కుల సాధనలో దేవుడే ఎదురుగా వచ్చి నిలబడినా ఎదురించి ప్రజలకు అండగా నిలబడుతామని.. తెలంగాణ ప్రజల్లో శాశ్వతంగా, గొప్పగా నిలిచిపోయే విధంగా మా విధానం ఉంటుందని ప్రజల హక్కులను తాకట్టు పెట్టమన్నారు.
ప్రజలు ఒక విశ్వాసం, నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చారని.. తెలంగాణ ప్రజల హక్కుల విషయంలో దేవుడే వచ్చి ఎదురుగా నిలబడినా దేవుడినైనా ఎదురించి తెలంగాణ ప్రజల తరఫున నిలబడుతామని పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి జిలాల్లో తెలంగాణ హక్కుల విషయంలో ఎవ్వరూ అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. బుధవారం (జూలై 9) కృష్ణా, గోదావరి నదీ జలాలు: వినియోగం: వివాదాలు అన్న అంశంపై జరిగిన, జరుగుతున్న పరిణామాలపై జ్యోతీరావు పూలె ప్రజా భవన్లో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ALSO READ | డీపీఆర్లో చెప్పిన చోట అన్నారం, సుందిళ్ల కట్టలే: మంత్రి ఉత్తమ్
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. కృష్ణా జలాలపై గత ప్రభుత్వంలో జరిగిన పరిణామాలతో పాటు ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు ప్రాధాన్యత, దాన్ని తర్వాత క్రమంలో తుమ్మడిహెట్టి నుంచి మేడిగడ్డకు స్థల మార్పు, తదనంతర పరిణామాలపై మంత్రి ఉత్తమ్ మరో ప్రజెంటేషన్ రూపంలో సమగ్రంగా వివరించారు. మేడిగడ్డలో నీటిని నిలువ చేస్తే ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలోని అంశాలను చెప్పారు
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో జరిగిన, జరుగుతున్న పరిణామాలపై శాసనసభలో అర్థవంతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. నదీ జలాల కేటాయింపుల్లో తెలంగాణ హక్కుల కోసం ప్రభుత్వం తీసుకోబోయే చర్యలపై పాలసీ డాక్యుమెంట్ను సభ ముందు అందజేస్తామని చెప్పారు. స్పీకర్ అనుమతితో నీటి పారుదల రంగ నిపుణులు, న్యాయ శాఖ నిపుణులు, స్టేక్ హోల్డర్స్ అందరినీ ఆహ్వానించి ఒక మంచి సానుకూల వాతావరణంలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ALSO READ | తెలంగాణలో యూరియా కొరత లేకుండా చూస్తాం
తెలంగాణ శాశ్వత హక్కులను కాపాడుకోవడం కోసం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ప్రజలకు వాస్తవాలు చేరవేయడమే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. వరద జలాలను వినియోగించుకుంటామని ఆంధ్రప్రదేశ్ వాదనను సీఎం రేవంత్ తోసిపుచ్చారు. ముందు నికర జలాల్లో వాటా తేలాలన్నారు. నికర జలాల్లో వాటా తేలిన తర్వాత మిగులు, వరద జలాల్లో ప్రొరేటా ప్రకారం ఇరు రాష్ట్రాలకు కేటాయింపులు జరగాలన్నారు.
ALSO READ | పబ్లు, క్లబ్లు కాదు.. అసెంబ్లీకి రండి: సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
నీటి వాటాలో తెలంగాణ హక్కుల కోసం సంబంధిత సంస్థలు, కేంద్ర ప్రభుత్వం ముందు వాదనలు వినిపించడమే కాకుండా న్యాయస్థానాల్లో పోరాడుతున్నాం. ఈ విషయంలో నీటి పారుదల శాఖ మంత్రి స్వయంగా సమన్వయం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే నీటి వాటాలో రాష్ట్ర హక్కులు దక్కేవని.. హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా నివసిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి ఉమ్మడి కోటా కింద నీటి వాటా కోరి ఉంటే ఈరోజు పరిస్థితి కొంత భిన్నంగా ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ALSO READ | నేనే ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు వస్తా.. అక్కడే చర్చిద్దాం: సీఎం రేవంత్
తెలంగాణ నీటిని రాయలసీమకు తరలించడం వల్ల శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల పరిధిలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పనికిరాకుండా పోయే ప్రమాదం ఏర్పడిందని ఈ రకంగా తక్కువ ధరకు లభించే విద్యుత్ విషయంలోనూ అన్యాయం జరిగిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన కల్వకుర్తికి నీటి కేటాయింపులను పూర్తి చేయలేదని.. అలాగే బీమా, నెట్టెంపాడు, నల్గొండకు గ్రావిటీతో తీసుకెళ్లే ఎస్ఎల్ బీసీ పూర్తి చేయలేదని పేర్కొన్నారు.
ఏ ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయని కారణంగా తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి నదిపై 2007-08 లో ప్రాణిహిత చేవెళ్ల (డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సుజల స్రవంతి) ప్రాజెక్టు తుమ్మడిహెట్టి నుంచి ప్రాంతాన్ని, అంచనాలను, పేరును మార్చడమే కాకుండా బేసిన్ల సాకుతో రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని ఆయకట్టును తొలగించడం వల్ల నష్టం జరిగిందని తెలిపారు.
ALSO READ | కేసీఆర్ చేసిన నేరానికి 100 కొరడా దెబ్బలు కొట్టాలి: సీఎం రేవంత్
ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం 54 లక్షల ఎకరాలకు నీరిస్తే ఎకరాకు 93 వేల రూపాయలు ఖర్చయిందని.. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం 15 లక్షల ఎకరాలకు నీరు ఇస్తే, ఎకరాకు 11.47 లక్షల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. ఇలా ప్రతి విషయంలోనూ ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. నీటి వాటాలకు సంబంధించిన అంశాలపై జరిగిన, జరుగుతున్న పరిణామాలపై సమగ్రమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు.