
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఒకే చట్టం తీసుకురావాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎఫ్ జీజీ) ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి కోరారు. మంగళవారం ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ర్టంలో జీహెచ్ఎంసీకి, మిగతా కార్పోరేషన్లు, మున్సిపాలిటీలకు వేరు వేరు చట్టాలు ఉన్నాయని పద్మనాభరెడ్డి తన లేఖలో ప్రస్తావించారు.
గ్రేటర్ చట్టం బాగానే ఉన్నా.. మిగతా వాటి చట్టాలు ప్రస్తుత అవసరాలు, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా లేదని చెప్పారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఒకే చట్టం రూపొందించాలన్నారు. జీహెచ్ఎంసీలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని, ప్రజల సమస్యలు పరిష్కరించటంలో అధికారులు, ఉద్యోగులు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారని వివరించారు. తప్పు చేసినా గ్రేటర్ లోనే పోస్టింగ్ ఇస్తారన్న ధీమా వారిలో ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఒకే చట్టాన్ని తీసుకురావాలని సీఎంను పద్మనాభరెడ్డి కోరారు.