క్రాప్‌‌ లోన్‌‌ టార్గెట్‌‌ రూ.3,404 కోట్లు .. 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఖరారైన రుణ ప్రణాళిక

క్రాప్‌‌ లోన్‌‌ టార్గెట్‌‌ రూ.3,404 కోట్లు .. 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఖరారైన రుణ ప్రణాళిక
  • 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఖరారైన రుణ ప్రణాళిక
  • గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం 14.5 శాతం పెంపు
  • గతంలో 88.41 శాతమే పంపిణీ
  • ఈ సారైనా పూర్తిస్థాయిలో లోన్లు ఇవ్వాలంటున్న రైతులు
  • సంగారెడ్డి జిల్లాలో 2.93 లక్షల మంది రైతులకు రుణాలు

సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి జిల్లాలోని రైతులకు 2025– 26 సంవత్సరంలో ఇచ్చే పంట రుణ ప్రణాళిక ఖరారు అయింది.  జిల్లాలోని 2.93 లక్షల మంది రైతులకు ఖరీఫ్‌‌, రబీ సీజన్లకు సంబంధించి క్రాప్‌‌లోన్ల కింద మొత్తం రూ.3,404 కోట్లు ఇవ్వాలని బ్యాంకర్లు నిర్ణయించారు. ఈ రుణ ప్రణాళికను రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సైతం ఆమోదించింది. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 14.5 శాతం అధికంగా ఇవ్వాలని బ్యాంకర్లు టార్గెట్‌‌గా పెట్టుకున్నారు. నిర్దేశించిన టార్గెట్‌‌ను చేరుకునేలా జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు బ్యాంకర్లకు సూచనలు చేస్తోంది. 

గతేడాది టార్గెట్‌‌కు చేరుకోని బ్యాంకర్లు..

బ్యాంకర్లు గతేడాది నిర్దేశించిన వార్షిక రుణ ప్రణాళిక కంటే 12 శాతం తక్కువగా క్రాప్‌‌లోన్లు ఇచ్చారు. 2024–-25 ఆర్థిక సంవత్సరానికి రూ.3,328.19 కోట్ల లోన్లు ఇవ్వాలని టార్గెట్‌‌గా పెట్టుకున్నారు. కానీ ఇందులో 2,942 కోట్లు మంజూరు చేసి 88.41 శాతానికి చేరుకున్నారు. 

ఈ సంవత్సరంలో రూ. 3,404 కోట్లు టార్గెట్‌‌గా పెట్టుకోగా దానిని చేరుకుంటారా లేదా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకర్లు రుణ ప్రణాళిక టార్గెట్‌‌ను చేరుకోవాలంటే వెంటనే కార్యాచరణ మొదలుపెట్టి, పెట్టుబడులకు సాయం అందించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వ్యవసాయ అనుబంధ రంగాలకు ఇచ్చే రుణాలు, వ్యవసాయ టర్మ్‌‌ లోన్లు, మౌలిక సదుపాయాల కోసం ఇచ్చే లోన్లు కలిపితే మొత్తం 3.13 లక్షల మంది రైతులకు రూ.6,721.87 కోట్లు ఇచ్చేందుకు బ్యాంకర్లు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.

2.98 లక్షల హెక్టార్లలో సాగు..

వానాకాలం పంటల సాగు ప్రణాళికను అగ్రికల్చర్‌‌ ఆఫీసర్లు ఇప్పటికే సిద్ధం చేశారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 2,98,718.22 హెక్టార్లలో వివిధ పంటలను సాగు చేయనున్నట్లు అంచనా వేశారు. ఇందులో ప్రధానంగా 1,43,817.81 హెక్టార్లలో పత్తి సాగు చేయనుండగా, 59,424.7 హెక్టార్లలో వరి, 32,044.53 హెక్టార్లలో కంది,  29,817.81 హెక్టార్లలో సోయాబీన్, 7,957.09  హెక్టార్లలో  చెరకు, 5,749.39 హెక్టార్లలో  పెసర సాగు చేయనున్నారు. అలాగే మినుములు 3,465.59 హెక్టార్లు, మొక్కజొన్న 3,441.3, జొన్న 237.5 హెక్టార్లతో పాటు మరో 9,898.79 హెక్టార్లలో హార్టికల్చర్‌‌ సాగుకు ప్లాన్‌‌ చేస్తున్నారు.

 వీటితో పాటు రాగులు, సామలు, కొర్రలు, ఉలువలు, ఎర్ర జొన్నలు, స్వీట్‌‌కార్న్‌‌, ఆవాలు, వేరుశనగ, గడ్డి నువ్వులు, హనుములు, బొబ్బర్లు, ఆవాలు, పొద్దుతిరుగుడు తదితర పంటలు సైతం తక్కువ విస్తీర్ణంలో సాగు కానున్నాయి. పంటల సాగుకు అనుగుణంగా ముందస్తుగా పెట్టుబడులకు బ్యాంకు రుణాలు అందితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని రైతులు అభిప్రాయపడుతున్నారు.