
- ఒక్కో కమిటీలో 30 మందికి చోటు
- కమిటీలో 25 మంది రైతులతోపాటు ఐదుగురు అధికారులు
- నియోజకవర్గాలు పూర్తయ్యాక జిల్లా స్థాయిలో కమిటీలు
నల్గొండ, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఆత్మ కమిటీ(అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ)లను త్వరలో ఏర్పాటు చేయనుంది. వ్యవసాయ సీజన్ ప్రారంభమైన తర్వాత రైతులకు సహాయ సహకారాలు అందిస్తూ వారి ఇబ్బందులు, సమస్యలను పరిష్కరించేందుకు ఈ కమిటీలు పనిచేయనున్నాయి. సీజన్ ప్రారంభం నాటి నుంచి పంట దిగుబడి చేతికొచ్చి మార్కెటింగ్ అయ్యేవరకు కమిటీలు సహకరిస్తాయి. వ్యవసాయరంగంతోపాటు రైతుల ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఈ కమిటీ ప్రణాళికలు రూపొందిస్తుంది. మార్కెటింగ్, సాంకేతికాభివృద్ధి, ఉత్పత్తులను పెంచడం, వ్యవసాయ ఉత్పత్తులకు మరింత ఊతమిచ్చేలా కృషి చేస్తాయి. వీటి ద్వారా రైతులను బలోపేతం చేస్తూ వారికి అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతాయి.
30 మంది సభ్యులతో కమిటీ..
ఆత్మ కమిటీలో మొత్తం 30 మంది సభ్యులు ఉంటారు. 25 మంది రైతులు, ఐదుగురు అధికారులకు ఇందులో చోటు కల్పిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రైతులకు ఈ కమిటీల్లో ప్రాధాన్యం కల్పిస్తారు. ఆత్మ కమిటీల్లో వ్యవసాయ అధికారులతోపాటు పశుసంవర్ధక, ఉద్యాన, హార్టికల్చర్, సెరికల్చర్, శాస్త్రవేత్తలు కమిటీ సభ్యులుగా ఉంటారు. వ్యవసాయ అభివృద్ధి కోసం కొన్నేళ్ల క్రితమే ఆత్మ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే గత ప్రభుత్వ హయాంలో ఆత్మ కమిటీలకు ఫండ్స్ కేటాయించకపోవడంతో ప్రస్తుతం వాటి ఊసే లేకుండా పోయింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆత్మను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయిలో ఆత్మ కార్యాలయం ద్వారా వ్యవసాయ సంబంధిత సాంకేతిక కార్యకలాపాలు నిర్వహించనున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 కమిటీలు..
ప్రతి కమిటీలో 30 మంది సభ్యులు ఉండగా, అందులో 25 మంది రైతులే ఉంటుండడంతో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా పరిష్కరించుకునేందుకు వీలుంటుంది. ప్రభుత్వ 12 నియోజకవర్గాల్లో కమిటీల ఏర్పాటుకు కసరత్తు జరుగుతుంది. నల్గొండ, నకిరేకల్, మునుగోడు, దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో త్వరలో కమిటీలు ఏర్పడనున్నాయి. వ్యవసాయరంగంలో ఉత్సాహవంతులైన రైతులు, అనుభవజ్ఞులకు చోటు కల్పించనున్నారు. ఇది పూర్తయ్యాక జిల్లా స్థాయిలో రైతుల సలహా కమిటీని ఏర్పాటు చేయనున్నారు.
త్వరలో ఆత్మ కమిటీలు
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో త్వరలో ఆత్మ కమిటీలు ఏర్పాటు చేసేందుకు ప్రపోజల్ సిద్ధం చేశాం. మొత్తం 30 మంది కమిటీ సభ్యుల్లో 25 మంది రైతులు, ఐదుగురు అధికారులు ఉంటారు. ప్రస్తుతం నియోజకవర్గ స్థాయిలో ఒక కమిటీ చొప్పున ఏర్పాటు చేస్తున్నాం. ఇది పూర్తయ్యాక జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తాం. - శ్రీధర్ రెడ్డి, సూర్యాపేట జేడీఏ