ప్రైవేటు కాలేజీల్లోనూ కౌన్సెలర్లు

ప్రైవేటు కాలేజీల్లోనూ కౌన్సెలర్లు

ఇంటర్​స్టూడెంట్లలో
ఆత్మస్థైర్యం నింపడమే లక్ష్యం
ఆత్మహత్యలకు
పాల్పడకుండా కౌన్సెలింగ్
30న కాలేజీల ప్రతినిధులతో అధికారుల సమావేశం
ఒక్కో కాలేజీ నుంచి ఒకరికి ట్రైనింగ్

హైదరాబాద్, వెలుగు: ఇంటర్  స్టూడెంట్లలో ఆత్మస్థైర్యం నింపి, బలవన్మరణాలకు పాల్పడకుండా చూసేందుకు ప్రైవేటు కాలేజీల్లోనూ కౌన్సెలర్లను ఏర్పాటు చేసేలా సర్కారు చర్యలు మొదలుపెట్టింది. ఈ విషయంపై ఇటీవలే సర్కారీ కాలేజీల్లో స్టూడెంట్స్​ కోసం కౌన్సెలర్లను నియమించిన విషయం తెలిసిందే. ప్రైవేటు కాలేజీల్లోనూ ఇలా నియమించుకునేలా చూడాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 30న హైదరాబాద్​లో కాలేజీ ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తోంది. గతేడాది ఇంటర్​ రిజల్ట్స్​ తర్వాత స్టూడెంట్లు ఆత్మహత్యలకు పాల్పడటంతో అప్పటి గవర్నర్ ఇచ్చిన ఆదేశాల మేరకు బోర్డు కౌన్సెలర్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.

ఆరు లక్షల స్టూడెంట్లు వాటిలోనే..

రాష్ట్రంలో మొత్తం 2,558 జూనియర్​ కాలేజీలుండగా.. వీటిలో 1,583 ప్రైవేటు, 404 సర్కారీ, 41 ఎయిడెడ్​కాలేజీలు ఉన్నాయి. వివిధ శాఖలు, విభాగాల పరిధిలో మరో 530 కాలేజీలున్నాయి. మొత్తంగా 10 లక్షల మంది వరకు ఇంటర్​ స్టూడెంట్లు ఉంటే.. అందులో 6 లక్షల మందికిపైగా ప్రైవేటు కాలేజీల్లోనే చదువుతున్నారు. గతేడాది ఇంటర్​బోర్డు చేసిన తప్పిదాలతో మార్కుల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొని.. సుమారు30 మంది వరకు స్టూడెంట్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ అంశాన్ని సీరియస్​గా తీసుకున్న నాటి గవర్నర్​ నరసింహన్.. స్టూడెంట్లలో ఒత్తిడిని నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు ఇటీవలే 404 సర్కారీ జూనియర్​ కాలేజీల్లో లెక్చరర్లను కౌన్సెలర్లుగా నియమించింది.  ప్రైవేటు, కార్పొరేట్​ కాలేజీల్లో స్టూడెంట్లపై మరింత ఒత్తిడి ఉండటం, గతంలో ఆత్మహత్యకు పాల్పడ్డ స్టూడెంట్లలో ఎక్కువ మంది ప్రైవేటు, కార్పొరేట్​ కాలేజీల వాళ్లు కావడంతో.. వాటిలోనూ కౌన్సెలర్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సబిత అధికారులను ఆదేశించారు.

ఒక్కో కాలేజీ నుంచి ఒక్కరికి..

మంత్రి ఆదేశాల నేపథ్యంలోనే ఇంటర్​బోర్డు ఈనెల 30న హైదరాబాద్​లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో ప్రైవేటు కాలేజీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఒక్కో కాలేజీ నుంచి ఒక్కో ప్రతినిధిని పంపించాలని మేనేజ్​మెంట్లకు ఇంటర్​బోర్డు కార్యదర్శి ఉమర్​ జలీల్​ ఆదేశాలు జారీ చేశారు. కాలేజీల ప్రతినిధులకు శిక్షణ ఇచ్చి వారి ద్వారా స్టూడెంట్స్​కు కౌన్సెలింగ్​ ఇప్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రైవేటు జూనియర్​ కాలేజీ మేనేజ్​మెంట్ల రాష్ట్ర అధ్యక్షుడు గౌరీ సతీశ్​స్వాగతించారు.

మరిన్ని వార్తల కోసం