టీచర్లకు ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్! ప్రభుత్వ బడుల్లో అమలుకు విద్యాశాఖ చర్యలు

టీచర్లకు ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్! ప్రభుత్వ బడుల్లో అమలుకు విద్యాశాఖ చర్యలు
  • సర్కారుకు ప్రతిపాదనలు పంపిన అధికారులు
  • పేరెంట్స్లో నమ్మకం పెంచేలా ప్రభుత్వ చర్యలు
  • స్కూల్ ఆవరణలోనే ఫేషియల్ అటెండెన్స్ వచ్చేలా ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడులపై పేరెంట్స్ లో మరింత నమ్మకం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీంట్లో భాగంగా టీచర్లందరికీ ఫేషియల్ అటెండెన్స్ అమలు చేయాలని యోచిస్తున్నది. టీచర్ల డుమ్మాలకు చెక్ పెట్టాలని డిసైడ్ అయింది. ఈ విద్యాసంవత్సరం నుంచే టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) అమలు చేసేందుకు పర్మిషన్ కోసం ప్రభుత్వానికి స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. రాష్ట్రవ్యాప్తంగా 24వేలకు పైగా సర్కారు స్కూళ్లు ఉండగా, వాటిలో సుమారు 17 లక్షల మంది విద్యార్థులున్నారు. ఆయా స్కూళ్లలో 1.07 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. 

ప్రస్తుతం టీచర్లకు కేవలం రిజిస్టర్ అటెండెన్స్ కొనసాగుతున్నది. ఈ విధానంతో కొందరు టీచర్లు బడికి రాకపోయినా తర్వాతి రోజు అటెండెన్స్ వేసుకుంటున్నారు. ఆలస్యంగా వచ్చిన వాళ్లూ సంతకాలు పెడ్తున్నారు. దీనికితోడు పలు గ్రామాల్లో రెగ్యులర్ టీచర్ల స్థానంలో, విద్యావాలంటీర్లను పెట్టి నడిపిస్తున్నారు. కొందరు నెలల తరబడి బడులకు పోకపోయినా, జీతాలు తీసుకున్న ఘటనలు ఇటీవల పలు జిల్లాల్లో బయటపడ్డాయి. లక్షకు పైగా ఉన్న టీచర్లలో కొందరు చేసినా.. నిందమాత్రం అందరు టీచర్లపై పడుతున్నది. ఇలాంటి సమయంలో సర్కారు బడులపై నమ్మకం మరింత సన్నగిల్లుతున్నది. ఈ తప్పులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

పైలెట్గా పెద్దపల్లిలో..
సర్కారు బడుల్లో అనేక వసతులు కల్పిస్తున్న ప్రభుత్వం.. వాటిని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు కొనసాగిస్తున్నది. ‘డీఎస్​ఈ–ఎఫ్ఆర్ఎస్’ యాప్ ద్వారా ప్రస్తుతం విద్యార్థులకు మాత్రమే ఫేషియల్ అటెండెన్స్ తీసుకుంటున్నారు. గతేడాది పైలెట్ ప్రాజెక్టు కింద పెద్దపల్లి జిల్లాలో ఇదే యాప్ ద్వారా టీచర్లంతా సెల్ఫ్ అటెండెన్స్ పేరుతో ఎఫ్ఆర్ఎస్ తీసుకుంటున్నారు. ఇది విజయవంతంగా కొనసాగుతున్నది. ఇదే విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు భావిస్తున్నారు.

స్కూల్ ఆవరణలోనే అటెండెన్స్..
ఎఫ్ఆర్ఎస్ యాప్ ద్వారా టీచర్లు స్కూల్ ఆవరణలోనే అటెండెన్స్ తీసుకునే అవకాశం ఉంది. దీంతో బయట తీసుకునే అవకాశం లేకుండా పోయింది. తద్వారా టీచర్లూ స్కూళ్లకు టైమ్​కు వచ్చే చాన్స్ ఉంది. ఇప్పటికే ప్రతి స్కూల్​కు కంప్యూటర్లు, ట్యాబ్​లు అందించారు. ఒకవేళ ఫోన్లలోని యాప్​లో ఏమైనా సమస్య ఉంటే.. స్కూళ్లలోని కంప్యూటర్లలో ఎఫ్ఆర్ఎస్ తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెప్తున్నారు. దీన్ని టీచర్ల సంఘాలూ స్వాగతిస్తున్నాయి. కొంతమంది టీచర్లు చేసే తప్పులు.. వ్యవస్థ మీద పడుతున్నదని, దీన్ని అరికట్టేందుకు ఎఫ్ఆర్ఎస్ విధానం అమలును తామూ కోరుకుంటున్నామని చెప్తున్నారు.

సర్కారుకు ప్రతిపాదనలు పంపినం
సర్కారు బడులన్నింటిలో ఫెషియల్ అటెండెన్స్ విధానం తీసుకురావాలని భావిస్తున్నాం. దీని అమలు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. సర్కారు అనుమతి ఇవ్వగానే అమలు చేసేందుకు రెడీగా ఉన్నాం. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలో ఎఫ్ఆర్ఎస్ విజయవంతంగా అమలు అవుతున్నది. దీనిద్వారా టీచర్లు టైమ్​కు స్కూల్​కు చేరుకునే అవకాశం ఉంది.


నవీన్ నికోలస్, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్