- టూర్లో కరోనా వస్తే ఖర్చంతా భరించేందుకు సిప్రస్ రెడీ
- 100 బెడ్లతో టూరిస్టుల కోసం స్పెషల్ ఆస్పత్రి
- 14 రోజుల క్వారంటైన్ రూల్ పెట్టిన ఫ్రాన్స్, బ్రిటన్, గ్రీక్
- పోర్చుగల్ ‘డోంట్ క్యాన్సిల్, పోస్ట్పోన్’ స్కీమ్
- చార్టర్ ఫ్లైట్స్ ల్యాండింగ్ చార్జీలు రద్దు చేసిన మాల్దీవ్స్
ప్యారిస్లో ఐఫిల్ టవర్ చూడాలని ఎవరికుండదూ.. వెనిస్ నగర అందాలను కళ్లల్లో దాచి పెట్టుకోవాలని ఎవరనుకోరూ.. మాల్దీవ్స్లో సరదాగా గడపాలని ఎంతమందికి ఉండదు..! అలా ప్రపంచాన్ని చుట్టేసి రావాలని అనుకునేటోళ్లను కరోనా ఇళ్లలోనే కట్టిపడేసింది. ఎటూ వెళ్లకుండా లాక్ చేసేసింది. ఇటు టూరిజం మీదే ఎక్కువ సంపాదించే దేశాలనూ దెబ్బ కొట్టింది. కొన్ని దేశాల ఎకానమీపై అది పెద్ద దెబ్బే వేసింది. అందుకే కొన్ని దేశాలు మళ్లీ టూరిస్టులకు వెల్కమ్ చెప్పాలని అనుకుంటున్నాయి. చిన్న చిన్నగా డోర్లు తెరవాలని చూస్తున్నాయి. గాడి తప్పిన ఎకానమీని టూరిజం బాట పట్టించాలని భావిస్తున్నాయి. కరోనా ప్రభావం ఇంకా పోకపోయినా దాని నుంచి కాపాడుకుంటూనే ఎకానమీని బతికించుకోవాలని ఆరాటపడుతున్నాయి.
ఫ్రాన్స్లో 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి
కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న దేశాల్లో ఫ్రాన్స్ది ఆరో స్థానం. మహమ్మారి ప్రారంభమైన మొదటి నుంచి ఆ దేశంపై దాని ప్రభావం ఎక్కువగానే ఉంది. కరోనాకు ముందు ప్రపంచంలో టూరిస్టులు ఎక్కువ టూర్ వేసిన దేశంగా ఫ్రాన్స్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. కానీ, కరోనాతో అంతా తారుమారైపోయింది. దీంతో మళ్లీ ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రావెలర్లకు ఆ దేశం బార్డర్లు తెరుస్తోంది. ఇప్పటికే దేశ ప్రజలు వంద కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసేందుకు వీలు కల్పించింది. మిగతా దేశాల నుంచి వచ్చే టూరిస్టులకూ త్వరలోనే అనుమతి ఇవ్వనుంది. అయితే, ఈయూ (యూరోపియన్ యూనియన్) దేశాలు, బ్రిటన్ మినహా వేరే దేశాల నుంచి వచ్చే వాళ్లు కచ్చితంగా 14 రోజుల క్వారంటైన్లో ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇక, దేశంలో టూరిస్టులు ఎక్కువగా వెళ్లిన లూవర్ మ్యూజియంను జులై 6 నుంచి ఓపెన్ చేస్తామని మే 29న ప్రభుత్వం ప్రకటించింది. జులై నుంచి ఫ్రాన్స్ ప్రజలంతా హాలిడే ట్రిప్పులకు వెళ్లొచ్చని చెప్పింది.
కరోనా వస్తే ఖర్చంతా సిప్రస్దే
వీలైనంత తొందరగా టూరిజం ఇండస్ట్రీని ఓపెన్ చేయాలని సిప్రస్ భావిస్తోంది. అంతేకాదు, వేరే దేశాల నుంచి వచ్చే టూరిస్టులకు దేశంలో కరోనా వస్తే.. మొత్తం ఖర్చులను ఆ దేశ ప్రభుత్వమే భరించనుంది. లాడ్జింగ్ నుంచి డ్రింక్స్, మందులను ఉచితంగా అందించనుంది. ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ను ఇప్పించనుంది. వాళ్ల కోసం ప్రత్యేకంగా వంద బెడ్ల ఆస్పత్రిని కూడా సిద్ధం చేసింది. వాళ్ల కాంటాక్ట్స్, ఫ్యామిలీని క్వారంటైన్ చేసేందుకు 500 గదులతో ఓ హోటల్నూ సిద్ధం చేసింది. ఒక్క విమాన చార్జీలను మాత్రమే సదరు ట్రావెలర్ భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నెల 1నే హోటళ్లను తెరిచిన ఆ దేశం, 9వ తేదీ నుంచి ఇంటర్నేషనల్ ట్రావెల్ను ఓపెన్ చేయనుంది. అయితే, దశలవారీగా వివిధ దేశాలకు ఓకే చెప్పనుంది. కరోనా మరణాలు ఎక్కువగా ఉన్న అమెరికా, బ్రిటన్ వంటి దేశాల వాళ్లకు మాత్రం నో చెప్పేస్తోంది.
జూన్ 15 నుంచి గ్రీక్ ఓపెన్
గ్రీక్ జీడీపీలో టూరిజం వాటా 20 శాతం. ప్రతి ఐదు ఉద్యోగాల్లో ఒకటి టూరిజంలోనే. కానీ, కరోనా దెబ్బతో ఎక్కడికక్కడ అది ఆగిపోయింది. ఎకానమీ నష్టపోయింది. దీంతో వీలైనంత తొందరగానే టూరిజం సెక్టార్ను ఓపెన్ చేయాలని ఆ దేశం నిర్ణయించింది. వీలైతే జూన్ 15 నుంచే ఓపెన్ చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. మే 20న టూరిజం గురించి మాట్లాడిన ఆ దేశ ప్రదాని కైరియోకస్ మిషోతాకిస్.. దేశంలో టూరిజం టైం జూన్ 15 నుంచి మొదలవుతుందని, అప్పుడే హోటళ్లన్నీ తెరవొచ్చని ఓ హింట్ ఇచ్చారు. అయితే, అది కేవలం దేశ ప్రజల వరకు మాత్రమే. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ను జులై 1 నుంచి మళ్లీ మొదలుపెడతామని ఆయన చెప్పారు. అది కూడా కేవలం 29 దేశాల వాళ్లకే పర్మిషన్ అన్నారు. వచ్చినోళ్లంతా ముందు 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిందేనన్న రూల్ కూడా పెట్టారు.
మాల్దీవుల్లో టూరిస్ట్ వీసా ఫీజు రద్దు
వెయ్యికిపైగా దీవులు కలిసిన ఐలాండ్ దేశం మాల్దీవ్స్. టూరిజంపైనే ఆ దేశం ఆధారపడింది. కరోనాతో మూతపడిన ఆ దేశంలో టూరిజాన్ని ఈ ఏడాది చివరి నాటికి ఓపెన్ చేయాలని ఆ దేశ సర్కార్ భావించింది. కానీ, కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో విడతల వారీగా ఓపెన్ చేస్తోంది. ఇప్పటికే జూన్ 1న సూపర్యాట్లు, జెట్లను అనుమతించింది. జులై నుంచి అన్ని దేశాల టూరిస్టులూ వచ్చేందుకు ఓకే చెప్పేసింది. ఇప్పటిదాకా చార్టర్ ఫ్లైట్స్, ప్రైవేట్ జెట్లు ల్యాండ్ అయ్యేందుకు వేస్తున్న 50 వేల డాలర్ల చార్జ్ను ఆ దేశం రద్దు చేసింది. టూరిస్ట్ వీసా ఫీజునూ రద్దు చేసింది. ఎలాంటి అదనపు చార్జీలనూ టూరిస్టుల మీద రుద్దబోమని అధికారులు చెప్పారు. అంతేకాకుండా కరోనా నేపథ్యంలో టూరిస్ట్ ఫెసిలిటీలకు సేఫ్ టూరిజం లైసెన్స్లనూ ఇవ్వనుంది. ఆయా సంస్థలు సేఫ్టీ చర్యలు తీసుకునేలా చట్టం చేసింది. ప్రతి టూరిస్ట్ సంస్థ ఓ డాక్టర్ను ఎప్పుడూ సిద్ధంగా ఉంచాలని, పీపీఈ కిట్లను తగినన్ని ఉంచుకోవాలని ఆదేశించింది. నిరుడు 17 లక్షల మంది టూరిస్టులు రాగా, ఈ ఏడాది 20 లక్షల మంది వస్తారన్న అంచనా ఉంది.
మరిన్ని దేశాల్లో ఇలా…
- జూన్ 15 నుంచి యూరప్ కంట్రీస్కు బార్డర్లు తెరవనుంది జర్మనీ. టర్కీ, బ్రిటన్, ఐస్లాండ్, నార్వే, స్విట్జర్లాండ్ వంటి దేశాలకూ అనుమతివ్వనుంది
- జూన్ 3 నుంచే బ్రిటన్ సహా యూరప్ దేశాలకు ఓకే చెప్పింది ఇటలీ. కొన్ని దేశాలు క్వారంటైన్ రూల్ పెడుతున్నా.. ఇటలీ మాత్రం అలాంటిదేమీ అవసరం లేదని చెప్పింది.
- జులై 1 నుంచి టూరిస్టులకు స్పెయిన్ అనుమతి ఇవ్వనుంది.
- జూన్ 15 తర్వాత విదేశీ టూరిస్టులకు గేట్లు ఓపెన్ చేయాలని పోర్చుగల్ భావిస్తోంది. అందులో భాగంగా ‘డోంట్ క్యాన్సిల్, పోస్ట్పోన్’ స్కీమ్ను ప్రారంభించింది. ఇప్పటికే బుక్ చేసుకున్న టూర్లను 2021 చివరి వరకు ఎప్పుడైనా రీషెడ్యూల్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
- జూన్ 4 నుంచి కరీబియన్ దీవుల్లో ఒకటైన సెయింట్ లూసియా జూన్ 4 నుంచి టూరిజం గేట్లు తెరిచింది. అయితే, వివిధ దేశాల నుంచి వచ్చేటోళ్లు ఫ్లైట్ ఎక్కడానికి 48 గంటలకు ముందు కచ్చితంగా కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ను ఇవ్వడాన్ని తప్పనిసరి చేసింది.
- టూరిస్టుల కోసం హోటళ్లు ఓపెన్ చేయాలంటే రెసిడెంట్ డాక్టర్తో ఓ క్లినిక్ను ఏర్పాటు చేయాల్సిందేనన్న రూల్ పెట్టింది ఈజిప్ట్. జులై మొదటి వారం నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్లకు అనుమతిచ్చే అవకాశాలున్నాయి.
- జూన్8 నుంచి ట్రావెలర్లను అనుమతించనుంది బ్రిటన్. ఇంటర్నేషనల్ టూరిస్టులందరికీ 14 రోజుల క్వారంటైన్ను తప్పనిసరి చేసింది. అందుకు ఆ ట్రావెలర్ డిక్లరేషన్ను ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ రూల్స్ బ్రేక్ చేస్తే 1,218 డాలర్ల ఫైన్ వేయనుంది.
- అక్టోబర్ నుంచి టూరిస్టులకు గేట్లు ఓపెన్ చేయాలని బాలి నిర్ణయించింది. అయితే, విదేశాల నుంచి వచ్చేటోళ్లకు ఎలాంటి షరతులు పెట్టబోయేది మాత్రం చెప్పలేదు.
- ఈ ఏడాది చివరి క్వార్టర్ నాటికి పర్యాటకానికి అనుమతి ఇవ్వాలని థాయ్లాండ్ భావిస్తున్నా.. అప్పటికి కరోనా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటోంది. కరోనా తీవ్రంగా ఉన్న దేశాల నుంచి మాత్రం టూరిస్టులకు నో అనేస్తోంది. టూరిస్టులు మారుమూల ప్రాంతాల టూర్కు వెళ్తే లాంగ్స్టే ప్యాకేజీలను ఇవ్వాలని భావిస్తున్నారు. అలాగైతే వాళ్ల ఆరోగ్యాన్ని ఈజీగా మానిటర్ చేయొచ్చని చెబుతున్నారు.

