
హైదరాబాద్, వెలుగు: పర్సనల్ వెహికల్స్కు ఇక దేశమంతా ఒకే రోడ్ ట్యాక్స్ అమల్లోకి రాబోతోంది. ఇందుకోసం కేంద్ర సర్కారు కసరత్తు చేస్తోంది. రాష్ట్ర జాబితాలో ఉన్న ‘రోడ్ ట్యాక్స్’.. ప్రస్తుతం ఒక్క స్టేట్లో ఒక్కోలా ఉంది. కర్నాటకలో అత్యధికంగా, త్రిపురలో అతి తక్కువగా పన్ను విధిస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చే వన్ నేషన్ వన్ రోడ్ ట్యాక్స్ విధానంతో ఇతర రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలోనూ ట్యాక్స్ తగ్గే అవకాశం ఉంది.
మన దగ్గర 9 నుంచి 14 శాతం వరకు
‘ఒక దేశం–-ఒకే రోడ్డు పన్ను’ విధానం కింద విధించాల్సిన పన్నులపై 2018లో నియమించిన మంత్రుల కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. వెహికల్ ఇన్వాయిస్ ధర ఆధారంగా పన్ను వసూలు చేయాలంది. వెహికల్ ప్రైజ్ రూ.10 లక్షల్లోపుంటే 8 శాతం పన్ను, రూ. 10–-20 లక్షల మధ్య ఉంటే 10 శాతం, రూ.20 లక్షలకు మించితే 12 శాతం పన్ను విధించాలని ప్రతిపాదించింది. అయితే మన రాష్ట్రంలో రూ.10 లక్షల లోపున్న వెహికల్స్కు 9 శాతం, రూ.10 లక్షలు ఆ పైన ఉంటే 14 శాతం పన్ను విధిస్తున్నారు. ఈ కొత్త ట్యాక్స్ విధానం అమలైతే మన దగ్గర రోడ్ ట్యాక్స్ తగ్గే చాన్స్ ఉంది.
కర్నాటకలో 13 నుంచి 18 శాతం
వెహికల్ కొనేటప్పుడు రోడ్ ట్యాక్స్ తప్పనిసరిగా కట్టాలి. ప్రస్తుతం ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా స్లాబులున్నాయి. కర్నాటకలో అత్యధికంగా 13 నుంచి 18 శాతం ఉండగా త్రిపురలో అత్యల్పంగా రూ.410 నుంచి రూ.825 దాకా ఉంది. దీంతో కొందరు తక్కువ ట్యాక్స్ ఉన్న రాష్ట్రాల్లో వెహికల్స్ కొంటున్నారు. ఫలితంగా ఎక్కువ పన్నున్న రాష్ట్రాల్లో వెహికల్స్ అమ్మకాలపై ప్రభావం పడుతోంది.
రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజు భారీగా పెంపు!
పొల్యూషన్ తగ్గించడంతో పాటు ఎలక్ట్రిక్ వెహికల్స్ పెంచడమే లక్ష్యంగా కేంద్రం ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా త్వరలో బండ్ల రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. 15 ఏళ్ల పైబడిన వెహికల్స్ రెన్యువల్ చార్జీలు భారీగా పెరిగే చాన్స్ ఉంది. ప్యాసింజర్ కార్లకు రెన్యువల్ ఫీజును ప్రస్తుతమున్న రూ. 1,000 నుంచి గరిష్టంగా రూ. 10,000కు పెంచే చాన్స్ ఉంది. ట్యాక్సీలకు రూ. 1,000 నుంచి రూ. 15,000కు పెంచాలని ప్రతిపాదించనున్నారు. దీనిపై త్వరలోనే ముసాయిదా నోటిఫికేషన్ రానుంది. పాత బండ్లతో పాటు కొత్త వాటి చార్జీలు పెరిగే అవకాశం ఉందని సమాచారం.