
నిర్భయ దోషి వినయ్ శర్మ వేసిన అప్లికేషన్ ను ఢిల్లీ పటియాల హౌస్ కోర్టు కొట్టేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనతో ఏకీభవించి.. ఈ ఆదేశాలిచ్చింది.
హైలెవల్ మెడికల్ ట్రీట్ మెంట్ ఇవ్వాలని వినయ్ శర్మ పెట్టుకున్న అప్లికేషన్ పై శనివారం ఉదయం విచారణ జరిగింది. జైలు తరుపున.. వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇర్ఫాన్ అహ్మద్.. వినయ్ శర్మ తన తలను గోడకు బాదుకోవడంతో వెంటనే డాక్టర్లను పిలిచి చికిత్స చేయించారని కోర్టుకు తెలిపారు. సీసీ ఫుటేజ్ ను తిహార్ జైలు అధికారులు కోర్టుకు సమర్పించారు. వినయ్ శర్మకు ఇదివరకు ఎలాంటి మానసిక సమస్యలు లేవని కోర్టుకు చెప్పారు.
దోషుల తరుపున వాదించిన ఏపీ సింగ్ సింగ్ మాత్రం.. వినయ్ శర్మకు సంబంధించిన వాస్తవాలను జైలు అధికారులు దాచి పెట్టారని ఆరోపించారు. కోర్టుకు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారన్నారు.
ఉరిశిక్షను ఆలస్యం చేయడానికే ఒక ప్లాన్ ప్రకారం దోషులు ఇలాంటి అప్లికేషన్లను పెడుతున్నారని, కోర్టులను తప్పుదారి పట్టిస్తున్నారని నిర్భయ తల్లి ఆశాదేవి అన్నారు. దాదాపు ఇప్పటివరకూ చట్టపరమైన అన్ని అవకాశాలను దోషులు ఉపయోగించుకున్నారని, మార్చి 3 న నలుగురూ దోషులకి ఉరితీస్తారని నమ్ముతున్నానని ఆమె అన్నారు.