- దేశ రాజధానిలో 31వేలు, మహారాష్ట్రలో 90వేల కేసులు
- ఇంకో 11వేలు కేసులు వస్తే ఫోర్ట్ ప్లేస్లోకి మన దేశం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. బుధవారం నాటికి కేసుల సంఖ్య 2,76,583కి చేరింది. వారం రోజుల నుంచి రోజుకు దాదాపు 10వేల కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో 11వేల కేసులు నమోదైతే మన దేశం కరోనా కేసుల్లో ఫోర్త్ ప్లేస్కు వస్తుందని, యూకేను దాటేస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం యూకేలో ప్రస్తుతం 2,87, 403 కేసులు నమోదయ్యాయి. దీంతో గురువారం కూడా కేసులు ఇంతే నమోదైతే యూకేను దాటేస్తామని అంచనా వేస్తున్నారు. అయితే ఇండియాలో మరణాల రేటు తక్కువగా ఉందని అధికారులు చెప్పారు. యూకేలో ఇప్పటి వరకు 40,579 మంది చనిపోతే.. మన దేశంలో 7,745 మంది మరణించినట్లు లెక్కలు చెప్తున్నాయి. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో పాజిటివ్ కేసుల సంఖ్య 31వేలుకు చేరింది. మహారాష్ట్రలో 90వేల కేసులు నమోదయ్యాయి. వైరస్ పుట్టిన వూహాన్ను మహారాష్ట్ర దాటేసింది. కాగా.. 48 గంటల్లో మహారాష్ట్రలోని పోలీస్ డిపార్ట్మెంట్లో జీరో కేసులు నమోదయ్యాయని పోలీసులు చెప్పారు. దేశంలోని ఆయా రాష్ట్రాల్లో కూడా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
కేసుల్లో టాప్ 5 రాష్ట్రాలు
1. మహారాష్ట్ర: 90,787 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 3,289 మంది వ్యాధి బారిన పడి చనిపోయారు. 42,638 మంది కోలుకున్నారు.
2. తమిళనాడు: 34,914 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 307 మంది చనిపోయారు. 18000 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.
3. ఢిల్లీ: 31,309 వ్యాధి బారిన పడగా..11,861 మంది కోలుకున్నారు. 905 మంది చనిపోయారు.
4. గుజరాత్: బుధవారానికి 21,014 కేసులు పాజిటివ్ కేసులు ఉండగా.. 1313 మంది చనిపోయారు. 14,365 మంది కోలుకున్నారు.
5. రాజస్థాన్: 11,245 పాజిటివ్ కేసులు కాగా.. వారిలో 8,328 మంది రికవర్ అయ్యారు. 255 మంది చనిపోయారు.
మిగతా రాష్ట్రాల్లో ఇలా..
మధ్యప్రదేశ్లో ఇప్పటి వరకు 10వేలే కేసులు, యూపీలో 11వేల కేసులు నమోదయ్యాయి. పశ్చిమబెంగాల్లో 8,985, బీహార్లో 5,459, ఏపీలో 5,070, కర్నాటకలో 6వేలు, తెలంగాణలో 3,900 మంది వైరస్ బారిన పడ్డారు. జమ్మూకాశ్మీర్లో 4,300, హర్యానాలో 5,500, ఒడిశాలో 3వేల కేసులు నమోదయ్యాయి. ఉత్తరాఖండ్, పంజాబ్, కేరళ, జార్ఖండ్, త్రిపుర, అస్సాం రాష్ట్రాల్లో 3వేల కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. మణిపూర్, చండీఘర్, గోవా, నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్, పుద్దుచ్చేరిలో 500 కంటే తక్కువ, మేఘాలయా, లడాఖ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, సిక్కిం, దాద్రా నగర్ హవేళీలో 100 కంటే తక్కువ కేసులు ఉన్నాయి.