అమెరికాలో వియత్నాం యుద్ధాన్ని మించిన ప్రాణనష్టం

అమెరికాలో వియత్నాం యుద్ధాన్ని మించిన ప్రాణనష్టం

వాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్ మునుపెన్నడూ లేనన్ని మరణాలను నమోదు చేస్తోంది. మహమ్మారి బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 58,955 కు పెరిగింది. కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయిన వారి సంఖ్య మంగళవారం నాటికి ఒక మిలియన్ మార్కును దాటింది. అమెరికా అగ్రరాజ్యంగా ఎదిగే క్రమంలో ఆ దేశం వియత్నాంతో చేసిన యుద్ధం.. అత్యధికంగా అమెరికన్లు చనిపోయిన ఘట్టంగా చరిత్రలో నిలిచిపోయింది. అయితే, కరోనా వైరస్ వ్యాపిస్తున్న ప్రస్తుత సమయంలో వియత్నాం యుద్ధ సమయంలో కంటే ఎక్కువగా అమెరికా ప్రాణ నష్టాన్ని చూడాల్సివస్తోంది.

యుద్ధాన్ని మించిన ప్రాణ నష్టం
యూఎస్ నేషనల్ ఆర్కైవ్స్ ప్రకారం.. వియత్నాం వివాదంలో 58,220 మంది అమెరికన్ సైనికులు మరణించారు. ఇది 1955 లో ప్రారంభమై 1975 లో ముగిసింది. యుద్ధంలో చనిపోయినవారి కంటే ఎక్కువగా ప్రస్తుతం అమెరికాలో వైరస్ బారిన పడి 58,955 మంది చనిపోయారు. మొత్తం 25 ఏండ్ల కాలంలో యుద్ధంలో అమెరికా 58,220 మంది సైనికులను కోల్పోగా.. కేవలం మూడు నెలల వ్యవధిలోనే వైరస్​వల్ల మరణాల సంఖ్య అంతకు మించిపోయింది. అత్యంత ఎక్కువగా కరోనా మరణాలు నమోదైన దేశంగా అమెరికా నిలిచింది.