కరోనా సెకండ్ వేవ్ మొదలైంది: డా. గులేరియా

కరోనా సెకండ్ వేవ్ మొదలైంది: డా. గులేరియా

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వచ్చే ఏడాది కూడా కొనసాగుతుందని ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా తెలిపారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన కొవిడ్-19 స్పెషల్ టాస్క్ ఫోర్స్ లో గులేరియా కీలక సభ్యుడిగా ఉన్నారు. వైరస్ ప్రభావం రోజురోజుకీ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో దీనిపై ఆయన పలు విషయాలు మాట్లాడారు. మహమ్మారి 2021లో ముగుస్తుందని చెప్పలేమని, కానీ వచ్చే ఏడాది వైరస్ ప్రభావ తీవ్రత తక్కువగా ఉండొచ్చునన్నారు.

‘కరోనా వ్యాప్తి చిన్న నగరాలతోపాటు రూరల్ ఏరియాలకూ పాకింది. అందుకే పాజిటివ్ కేసులు ఇంతగా పెరుగుతున్నాయి. జనాభాను బట్టి చూస్తే మరికొన్ని నెలలు కేసుల పెరుగుదలను ఊహించొచ్చు. దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. టెస్టింగ్ కెపాసిటీ పెరగడంతో పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నాం. దీంతో లక్షణాలు తక్కువ దశలో ఉన్నప్పుడే పాజిటివ్ అని బయట పడుతుండటంతో జాగ్రత్తలు తీసుకుంటూ, వైరస్ బారి నుంచి కోలుకోవడం సులువవుతోంది. అయితే కరోనా సేఫ్టీ మెజర్స్ తీసుకోవడంలో చాలా చోట్ల ప్రజలు నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీలో కూడా ప్రజలు మాస్కులు కట్టుకోవడం లేదు. గుంపులుగా గుమిగూడుతున్నారు. కేసుల పెరుగుదలకు ఇదీ ఒక కారణమే’ అని గులేరియా పేర్కొన్నారు.