చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని కకావికలం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా శనివారం నాటికి 6 లక్షల మందికి పైగా సోకిన ఈ వైరస్ ఇప్పటికే లక్షా 33 వేల మందిని బలి తీసుకుంది. ఈ మహమ్మారి పుట్టిన చైనాలో ప్రస్తుతం కొంత మేర వైరస్ వ్యాప్తి కంట్రోల్ లోకి వచ్చింది. గడిచిన నాలుగు నెలల్లో ఆ దేశంలో 81,349 కరోనా కేసులు నమోదు కాగా.. 3295 మంది మరణించారు. కొద్ది రోజులుగా అక్కడ నమోదవుతున్న కేసుల సంఖ్య సింగిల్ డిజిట్ కి వచ్చేసింది. ప్రస్తుతం భారత్ పాటిస్తున్న లాక్ డౌన్ లాంటి విధానాల ద్వారా చైనా ఈ విజయం సాధించగలిగిందని ఆ దేశం చెబుతోంది. కానీ, అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికా పరిస్థితి వేగంగా దిగజారుతోంది. కొద్ది రోజుల్లోనే కేసుల సంఖ్య భారీగా పెరిగింది. లక్షకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. 1700 మందికిపైగా మరణించారు. ఇక ఇటలీలో 86,500 మందికి వైరస్ సోకగా.. 9 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలో 940 మంది కరోనా బారినపడగా.. 20 మంది మరణించారు.
అక్కడ అలా.. మన దగ్గరిలా…
ఎంతో అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పుకునే అమెరికా లాంటి చోటే వైరస్ అత్యంత వేగంగా వ్యాపించడానికి కారణం ఆ దేశం చాలా ఆలస్యంగా మేలుకోవమే. దేశంలో వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నా.. లాక్ డౌన్ వంటి నిర్ణయాలు తీసుకునేందుకు అధ్యక్షుడు ట్రంప్ వెనకడుగేశారు. మనుషుల ప్రాణాల కన్నా ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడమే ముఖ్యమన్నట్లుగా తొలుత ప్రకటనలు చేశారాయన. దీని వల్ల అక్కడ వైరస్ వ్యాప్తి కమ్యూనిటీ స్ప్రెడ్ దశలోకి వెళ్లిపోయింది. అయితే ఆ దేశంతో పోల్చుకుంటే సదుపాయాలు, టెక్నాలజీ పరంగా కొంతమేర వెనుకబడి ఉన్న భారత్ లో ఆ స్థాయిలో వైరస్ విజృంభిస్తే నిలదొక్కుకోవడం చాలా కష్టం. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం చాలా ముందస్తుగా రంగంలోకి దిగింది.
వాళ్లు ప్రాణాలకు తెగిస్తే… వీళ్లు ఆగం చేస్తున్నారు
కరోనా పేషెంట్ల సంఖ్య నాలుగు వందలు దాటేలోపే అప్రమత్తమై లాక్ డౌన్ దశగా నిర్ణయం తీసుకుని.. జనతా కర్ఫ్యూతో ప్రజల్ని సంసిద్ధం చేసింది భారత ప్రభుత్వం. అదే స్ఫూర్తిని కొనసాగించాలన్ని చెబుతూ నెమ్మదిగా ప్రధాని మోడీ.. దేశ వ్యాప్త లాక్ డౌన్ ప్రకటించారు. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ లేదని, సామాజిక దూరం ఒక్కటే ఈ అంటు వ్యాధి వ్యాప్తిని కంట్రోల్ చేసే మందు అని, ప్రజలంతా ఇళ్లలోనే ఉండి దేశాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.
ఇదే సమయంలో నిరంతరం ప్రజల ఆరోగ్యం కోసం డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, శానిటేషన్ ఉద్యోగులు, పోలీసులు.. వాళ్ల ప్రాణాలను సైతం రిస్క్ లో పెట్టి కరోనాపై పోరాడుతున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఆస్పత్రిలో ఉండి డాక్టర్లు, నర్సులు.. కరోనా బారినపడిన పేషెంట్లకు, అనుమానితులకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. అదే సమయంలో బయట ప్రజలు సామాజిక దూరం పాటించాలని, ఎవరి ఇళ్లలో వాళ్లు ఉండి వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని రోడ్లపైనే ఉండి పోలీసులు అవగాహన పెంచడంతో పాటు లాక్ డౌన్ కచ్చితంగా అమలయ్యేలా చూస్తున్నారు పోలీసులు. కానీ ఎంత చెప్పినా వినకుండా ఇష్టమొచ్చినట్లు బయట తిరుగుతూ.. కరోనా మహమ్మారి వ్యాప్తికి సాయం చేసేలా ప్రవర్తిస్తున్నారు కొందరు ఆకతాయిలు. కోరలు చాచిన వైరస్ వైపు దేశాన్ని నెట్టేసేలా పిచ్చి చేష్టలు చేస్తున్నారు. కరోనా కట్టడికి ప్రబుత్వం చేస్తున్నా పనులకు, డాక్టర్లు ప్రాణాలకు తెగించి చేస్తున్న కృషికి ఫలితం లేకుండా చేస్తున్నారు. ఇలాంటి వెర్రి చేష్టలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు పోలీసులు. ముందు ఓపికగా చెబుతున్నారు.. వినకుంటే లాఠీకి పని చెప్పి కరోనా బారి నుంచి దేశాన్ని కాపాడే పనిలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు.
ఈ మొత్తాన్ని చెప్పాలే ఒక చిన్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైర్ అవుతోంది. కరోనా కోరల్లో చిక్కుకోకుండా దేశాన్ని కాపాడేందుకు డాక్టర్లు కృషి చేస్తున్నారు. దానికి విఘాతం కలిగించే ప్రయత్నంలో ఉన్న ఆకతాలు ఉండగా.. వారిని అడ్డుకునేందుకు పోలీసులు పడుతున్న పాట్లు ఆ ఫొటో సింబాలిక్ గా చూపిస్తోంది.