కరోనా వైరస్ ను కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. లాక్ డౌను రూల్స్ ను బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా పోలీసు డిపార్ట్ అంతా క్షణం తీరికలేకుండా పనిచేస్తోంది. ఓ కానిస్టేబులైతే… తనకు రెండు రోజుల క్రితం కొడుకుపుట్టాడని తెలిసినా ఇంటికి వెళ్లకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
నిన్న(శుక్రవారం)రాత్రి సీపీ అంజనీకుమార్ తన విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నారు. దారిలోని చెక్పోస్టు దగ్గర విధుల్లో ఉన్న కానిస్టేబుళ్ల క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగానే లిబర్టీ దగ్గర విధుల్లో ఉన్న నారాయణగూడ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ సాయికిషన్ని పలకరించారు. ఈ సందర్భంగా అతను తనకు రెండు రోజుల క్రితం బాబు పుట్టాడని చెప్పడంతో సీపీ ఆశ్చర్యపోయారు. అటువంటి సమయంలో కూడా కుటుంబాన్ని వదిలి విధులు నిర్వహిస్తున్న సాయికిషన్ని అభినందించి స్వీట్లు, బిస్కెట్లు అందించారు. సంతోషం వ్యక్తం చేసిన కానిస్టేబుల్ సాయికిషన్ సీపీకి కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు.