
- సీపీ సాయిచైతన్య
నిజామాబాద్, వెలుగు: వీఐపీలకు సెక్యూరిటీగా విధులు నిర్వర్తించే సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సీపీ సాయిచైతన్య సూచించారు. శుక్రవారం జిల్లాలోని పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లకు నిర్వహించిన రెండు రోజుల శిక్షణా శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. నైపుణ్యాలు మెరుగుపర్చుకోవడానికి శిక్షణ దోహదపడుతుందని, అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో అవగాహన కలుగుతుందన్నారు. నిబద్ధతతో నిర్వహించే విధులు మైలురాయిగా నిలుస్తాయన్నారు. ఏఆర్ అదనపు డీసీపీ రామచంద్రరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, తిరుపతి, సతీశ్, శేఖర్బాబు తదితరులు పాల్గొన్నారు.
ఎస్సారెస్పీ విజిట్
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు సందర్శకుల రద్దీ పెరుగుతుండడంతో బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సీపీ సాయిచైతన్య ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్రెడ్డికి సూచించారు. శుక్రవారం ప్రాజెక్టును సందర్శించి మాట్లాడారు. పార్కింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రాజెక్టు గేట్లు మళ్లీ ఓపెన్ చేసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పశువుల కాపర్లు, మత్స్యకారులు ప్రాజెక్టు పరిసర ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరించారు. సీఐ శ్రీధర్రెడ్డి, మెండోరా ఎస్సై సుహాసిని తదితరులు ఉన్నారు.