రోడ్లపైకి వస్తే ఆధార్‌ తప్పనిసరి

రోడ్లపైకి వస్తే ఆధార్‌ తప్పనిసరి

రంగారెడ్డి : నిత్యావసర సరుకులు, వస్తువుల కోసం రోడ్లపైకి వచ్చే వారు తప్పనిసరిగా హెల్మెట్‌, లైసెన్స్‌, ఆధార్‌ కార్డు కూడా తీసుకురావాలని తెలిపారు సైబ‌రాబాద్ సీపీ సజ్జనార్‌. గురువారం రాజేంద్రనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని అత్తాపూర్ పర్యటించిన సీపీ.. రోడ్లపై తిరుగుతున్న వాహనాలను తనిఖీ చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలను సీజ్‌ చేసి కేసులు నమోదు చేశారు.

ఈ సందర్భంగా సీపీ సజ్జనార్‌ మీడియాతో మాట్లాడారు. అనుమతి లేకుండా, కారణం లేకుండా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్‌ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిత్యావసర సరుకులు, వస్తువుల కోసం రోడ్లపైకి వచ్చే వారు తప్పనిసరిగా హెల్మెట్‌, లైసెన్స్‌, ఆధార్‌ కార్డు కూడా తీసుకురావాలని సూచించారు. నిత్యావసర సరుకుల కోసం వచ్చే వారికి 3 కిలోమీటర్ల లోపు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. పోలీసులు ఎక్కడ తనిఖీలు చేసినా ప్రజలు సహకరించాలని కోరారు సీపీ స‌జ్జ‌నార్.