
చేర్యాల, వెలుగు: పోతిరెడ్డిపల్లిలో దళితులకు కేటాయించిన భూములకు సంబంధించి రద్దు చేసిన పట్టాలను పునరుద్ధరించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం పోతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ వద్ద జరిగిన భూభారతి రెవెన్యూ సదస్సులో దళితులతో కలిసి రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2022లో దళితులకు కడవేర్గు రెవెన్యూ పరిధిలోని 453 సర్వే నంబర్లో ఒక్కొక్కరికి ఎకరం చొప్పున 70 ఎకరాలు పంపిణీ చేశారని, పట్టాదారు పాస్పుస్తకాలు కూడా ఇచ్చారని తెలిపారు.
కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ భూములను గుంజుకొని, పట్టాలు రద్దు చేశారని వాటిని ఫారెస్ట్అధికారులు స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. పట్టాలను పునరుద్ధరించని పక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యాదగిరి, కనకయ్య, మమత, బాలవ్వ, కలవ్వ, మల్లమ్మ, లక్ష్మి, రాణవ్వ, నర్సవ్వ, పుష్ప తదితరులు పాల్గొన్నారు.