అహంభావం వల్లే కేసీఆర్‌కు బుద్ధి చెప్పిండ్రు: సీపీఐ నారాయణ

అహంభావం వల్లే కేసీఆర్‌కు బుద్ధి చెప్పిండ్రు: సీపీఐ నారాయణ
  • బీఆర్ఎస్​లీడర్లు తలకాయ లేకుండా మాట్లాడుతున్నరు
  • సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్​పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫైర్​అయ్యారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోతే కొంపలు మునిగిపోయాయా అంటారా ..? అని మండిపడ్డారు. గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం పద్ధతి కాదని చెప్పారు. ఆయన అహంభావం, అవినీతి వల్లే.. ఉద్యమ పార్టీకి కూడా ప్రజలు బుద్ది చెప్పారని తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో నారాయణ మాట్లాడుతూ ‘ కేసీఆర్ ఎందుకు పోటీ చేశారు.. ఎందుకు అసెంబ్లీకి వెళ్లట్లేదు? ప్రజా సంపాదనను పందికొక్కులా తింటూ శాసనసభకు పోవడం లేదు. 

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణ కోరాలని తెలంగాణ బీజేపీ తెలివిగా వ్యవహరిస్తోంది. కేసు అప్పగిస్తే మేనేజ్‌ చేయాలనుకుంటున్నారు. కేసీఆర్‌ను ఆ పార్టీ కాపాడే ప్రయత్నం చేస్తోంది. వేల కోట్ల రూపాయల అవినీతికి ఆయన బాధ్యుడు. జరిగిన అవినీతిపై విచారణ చేయించాలి. ముఖ్యమంత్రి పదవి ఇస్తే అభివృద్ధి చేస్తామని హరీశ్ రావు అనడం సిగ్గు చేటు. బీఆర్ఎస్​లీడర్లు తలకాయ లేకుండా మాట్లాడుతున్నరు.  రెండు నెలలు కాకముందే ప్రభుత్వంపై విమర్శలు చేయడం బీఆర్ఎస్ పతనానికి పరాకాష్ట’ అని నారాయణ అన్నారు.