
- కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడాలి
- అప్పుడే 18న రాష్ట్ర బంద్లో పాల్గొంటామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాటకమాడుతున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ విమర్శించారు. ఒకవైపు కేంద్రంలో బీసీ రిజర్వేషన్ల బిల్లును, ఆర్డినెన్స్ను అడ్డుకుంటూ ఇంకోవైపు రాష్ట్రంలో ఈ నెల 18న బీసీ జేఏసీ రాష్ట్ర బంద్కు బీజేపీ మద్దతు ఇచ్చిందని మండిపడ్డారు. హైదరాబాద్లోని సీపీఐ(ఎం) స్టేట్ ఆఫీస్ ఎంబీ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసిందన్నారు. రిజర్వేషన్లను అమలు చేసే పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా పోరాడితేనే ఈ నెల 18న బీసీ జేఏసీ తలపెట్టిన రాష్ట్రబంద్లో పాల్గొంటామని, లేదంటే స్వతంత్రంగా ఉద్యమిస్తామని తెలిపారు. ‘‘కేంద్రానికి వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటంలో బీసీ సంఘాలు, మేధావులు భాగస్వాములు కావాలి. బీసీ రిజర్వేషన్లపై కేంద్రం తీరుకు నిరసనగా శుక్రవారం చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని చేపడ్తున్నం.
అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో ఏకగ్రీవంగా ఆమోదించి బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఆరు నెలలైనా ఆమోదించలేదు. రాష్ట్ర మంత్రివర్గం ఆర్డినెన్స్ను ఆమోదించి గవర్నర్కు పంపిస్తే దాన్ని కూడా కేంద్రానికి పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జీవో 9ని విడుదల చేసింది. ఆ జీవోపై హైకోర్టు స్టే విధించింది. ఆ స్టేను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే ఆ పిటిషన్ను తిరస్కరించింది’’అని జాన్ వెస్లీ వివరించారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ ప్రజాప్రతినిధులు అడుగుతారా? అని నిలదీశారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేంద్రం అడ్డుకుంటున్నదని మండిపడ్డారు.