
భద్రాచలం, వెలుగు : భద్రాచలం వద్ద కరకట్ట నిర్మాణపు పనులను త్వరగా పూర్తి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యుడు ఏజే రమేశ్కోరారు. నిర్మాణ ప్రాంతాన్ని మంగళవారం వారు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ.38కోట్లతో కూనవరం రోడ్డులో కడుతున్న కరకట్ట పనులను గోదావరి వరదల సమయానికి పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఇరిగేషన్ ఈఈ, డీఈ, జేఈలతో సీపీఎం బృందం భేటీ అయ్యింది. కరకట్టల నిర్మాణపు పనుల ఆలస్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
ఈఈ జానీ మాట్లాడుతూ కరకట్ట నిర్మాణంలో అంతర్భాగమైన హై లెవల్ రోడ్డు కోసం సర్వే చేసి ఎస్టిమేషన్స్ నేషనల్ హైవే అథారిటీకి పంపినట్లుగా వివరించారు. సుభాష్నగర్, ఇతర కాలనీల్లోకి గోదావరి వరద రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలవరం బ్యాక్ వాటర్ ముంపుపై రెండు రాష్ట్రాలతో జాయింట్ సర్వేకు అప్పీలు చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా హైదరాబాద్ ఐఐటీ ఇంజినీరింగ్ నిపుణులతో సర్వే చేసేందుకు ప్రత్యేక నిధులు మంజూరు చేసిందన్నారు. సీపీఎం బృందంలో టౌన్ సెక్రటరీ గడ్డం స్వామి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎంబీ నర్సారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు సున్నం గంగా, బండారు శరత్బాబు, వైవీ రామారావు ఉన్నారు.