
- లగచర్లకో న్యాయం.. నిమ్జ్ బాధితులకో న్యాయమా ?
- సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ధర్నాలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
సంగారెడ్డి, వెలుగు : లగచర్ల, ముచ్చర్ల నిర్వాసితులకు మూడింతల పరిహారంతో పాటు 120 గజాల ప్లాట్ ఇస్తున్న ప్రభుత్వం.. నిమ్జ్ బాధితులకు ఎందుకు ఇవ్వడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రశ్నించారు. అక్కడో న్యాయం.. ఇక్కడో న్యాయం అన్నట్లుగా వ్యవహరించడం అప్రజాస్వామికం అన్నారు. నిమ్జ్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అంతకుముందు పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు.
ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ పేదలకు తక్కువ పరిహారం ఇచ్చి భూములు లాక్కోవడం సరికాదన్నారు. సీఎం రేవంత్రెడ్డి చెందిన భూములను గానీ, మాజీ సీఎం కేసీఆర్ ఫామ్హౌస్ భూములను గానీ రూ.15 లక్షలకు ఎకరం చొప్పున ఇస్తారా అని ప్రశ్నించారు. నిమ్జ్ నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం మార్కెట్ రేటుపై మూడింతల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజల అభిప్రాయం లేకుండా బలవంతంగా భూ సేకరణ ఎట్లా చేస్తారని నిలదీశారు. అనంతరం కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందజేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, సీపీఎం జహీరాబాద్ ఏరియా కార్యదర్శి బి.రాంచంద్రం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.రాజయ్య పాల్గొన్నారు.