
న్యూఢిల్లీ: బీజేపీని ఓడించేందుకే మునుగోడులో టీఆరెస్ తో పొత్తు పెట్టుకున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక, సెప్టెంబర్ 17 తదితర అంశాలపై తమ్మినేని వీరభద్రం మాట్లాడారు. ప్రతిపక్షాల ప్రభుత్వాలను కూలగొడుతూ బీజేపీ తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో కూడా ఎలాగైనా పాగా వేయాలనే బీజేపీ మునుగోడు ఉప ఎన్నికకు కుట్రలు చేసిందన్నారు. రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే నెల రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొడుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పడం అందుకు నిదర్శనమన్నారు. అభివృద్ధి కోసమే తాను రాజీనామా చేసినట్లు రాజాగోపాల్ రెడ్డి కుంటి సాకులు చెబుతున్నారని ఆరోపించారు. మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే తీవ్ర పోటీ ఉండనుందని, బీజేపీని ఓడించేందుకే తాము టీఆర్ఎస్ కు మద్దతు పలుకుతున్నట్లు మరోసారి స్పష్టం చేశారు.
అయితే టీఆర్ఎస్ కు తమ మద్దతు మునుగోడు ఉప ఎన్నిక వరకేనని, ప్రజా సమస్యలపై టీఆర్ఎస్ పై తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 17 ను విమోచన దినంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, కానీ తెలంగాణ సాయుధ పోరాటానికి.. బీజేపీకి ఏమాత్రం సంబంధం లేదని చెప్పారు. చరిత్రను వక్రీకరిస్తోందని, మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతోందని బీజేపీపై మండిపడ్డారు. సాయుధ పోరులో నిజాంకు వ్యతిరేకంగా ముస్లింలు కూడా పోరాడారని గుర్తు చేశారు. సెప్టెంబర్ 10 నుంచి 17 వరకు సీపీఎం ఆధ్వర్యంలో సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, వీటిలో పార్టీ కేంద్ర నాయకులు పాల్గొంటారని వెల్లడించారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.