ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ పై స్పష్టత ఇవ్వాలి

ట్రిపుల్ ఆర్  అలైన్మెంట్ పై  స్పష్టత ఇవ్వాలి
  • 2013 చట్టం ప్రకారం రైతులకు న్యాయం చేయాలి
  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్
  • 6న హెచ్ఎండీఏ ఎదుట నిర్వాసితుల ధర్నా

హైదరాబాద్, వెలుగు: రీజనల్  రింగ్  రోడ్డు (ఆర్ఆర్ఆర్) అలైన్ మెంట్  మార్పుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్  చేశారు. 2013 చట్టం ప్రకారం  రైతులకు న్యాయం చేయాలని శుక్రవారం ఓ ప్రకటనలో ఆయన కోరారు. ఈ నెల 6న సీపీఎం ఆధ్వర్యంలో హైదరాబాద్​లో హెచ్ఎండీఏ కార్యాలయం ఎదుట నిర్వాసితులతో ధర్నా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.  రైతులతో మాట్లాడకుండా, గ్రామ సభలు నిర్వహించకుండా, భూ సేకరణలో స్పష్టత ఇవ్వకుండా బలవంతంగా భూములు తీసుకోవాలని ప్రయత్నం చేస్తే రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. 

మొత్తం 8 జిల్లాలు, 33 మండలాలు, 163 గ్రామాల పరిధిలో 100 మీటర్ల వెడల్పుతో ఆ రోడ్డును నిర్మించాలని హెచ్ఎండీఏ నోటిఫికేషన్  ఇచ్చిందని గుర్తు చేశారు. దీని కోసం భూములు తీసుకుంటామని, రైల్వే ట్రాక్  కోసం మరొక 40 అడుగుల వెడల్పుతో రోడ్డును పెంచుతామని ప్రభుత్వం చెబుతున్నదన్నారు. మొదటి అలైన్ మెంట్ తయారు చేశారని, తర్వాత దాన్ని మార్చి రెండోసారి అలైన్ మెంట్ రూపొందించారని,  ఇప్పుడు మూడో అలైన్ మెంట్  తయారుచేసి విడుదల చేశారన్నారు. 

రాజకీయ అండదండలు, డబ్బు ఉన్నవారి భూముల జోలికి వెళ్లకుండా లేకుండా చిన్న, సన్నకారు రైతుల భూములున్న ప్రాంతాన్నే రింగ్  రోడ్డు కోసం తీసుకుంటున్నట్లు  ఆరోపణలు వస్తున్నాయన్నారు. 2013 చట్టం ప్రకారం గ్రామసభల ద్వారా రైతుల ఆమోదం తీసుకోవాలన్నారు. భూమికి భూమి ఇవ్వాలని, మార్కెట్  రేటుకు మూడింతలు అదనంగా చెల్లించాలన్నారు.