- హోమ్ లోన్ల వడ్డీ డిడక్షన్ను రూ.5 లక్షలకు పెంచండి
- అఫోర్డబుల్ హౌసింగ్ లిమిట్ను పొడగించండి
- రూ. 20 లక్షల వరకు రెంటల్ ఇన్కమ్పై మినహాయింపులివ్వండి
న్యూఢిల్లీ: రానున్న బడ్జెట్లో హోమ్ లోన్ వడ్డీ డిడక్షన్ను ప్రస్తుతం ఉన్న రూ.2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని రియల్టర్స్ అసోసియేషన్ క్రెడాయ్ ప్రభుత్వాన్ని కోరింది. వడ్డీ రేట్లు పెరగడంతో హోమ్ బయ్యర్లకు రిలీఫ్ ఇచ్చే చర్యలు తీసుకోవాలని విన్నవించింది. గత ఏడు నెలల్లో హోమ్ లోన్లపై వడ్డీ రేటు 2 శాతం మేర పెరిగిందని పేర్కొంది. వడ్డీ రేట్లు పెరగడంతో హోమ్ బయ్యర్లపై ఈఎంఐ భారం పెరిగిందని, అందువలన హోమ్ లోన్ వడ్డీ మినహాంయింపును కనీసం రూ. 5 లక్షల వరకు ఇవ్వాలని కోరింది. దీంతో మిడిల్ క్లాస్ హోమ్ బయ్యర్ల దగ్గర లిక్విడిటీ (డబ్బులు) పెరగడమే కాకుండా, కొత్తగా ఇల్లు తీసుకోవాలనుకునే వారూ పెరుగుతారని క్రెడాయ్ వివరించింది. రియల్టీ సెక్టార్లో గ్రోత్ కొనసాగేలా తమ రికమండేషన్స్ ఉన్నాయని క్రెడాయ్ ప్రెసిడెంట్ హర్ష్ వర్ధన్ పటోడియా అన్నారు. వడ్డీ రేట్లు పెరుగుతుండడంతో హౌసింగ్ డిమాండ్ పడిపోతుందని పేర్కొన్నారు.
మరిన్నీ రికమండేషన్స్..
ప్రస్తుతం రూ.45 లక్షల లోపు ఉంటే అఫోర్డబుల్ హౌస్గా పరిగణిస్తున్నారు. ఈ లిమిట్ను పెంచాలని క్రెడాయ్ కోరుతోంది. కన్స్ట్రక్షన్ ఖర్చులు, సరుకుల ధరలు ఎక్కువయ్యాయని తెలిపింది. మెట్రోల్లో ఈ లిమిట్ రూ.80 లక్షలకు, నాన్ మెట్రో సిటీల్లో రూ.60-–65 లక్షలకు పెంచాలని స్క్వేర్ యార్డ్స్ ఫౌండర్ పీయుష్ అన్నారు. డిమాండ్ను పెంచేందుకు ఏడాదికి రూ. 20 లక్షల దాకా రెంటల్ ఇన్కమ్ వస్తున్న వారికి 100 శాతం మినహాయింపు ఇవ్వాలని క్రెడాయ్ కోరింది.