- స్టార్ ఇండియా రిక్వెస్ట్ను పరిశీలిస్తున్న బీసీసీఐ
- వచ్చే వారం షెడ్యూల్ రిలీజయ్యే ఛాన్స్
ముంబై: ఐపీఎల్ 15వ సీజన్ అనుకున్న షెడ్యూల్ కంటే కాస్త ముందుగానే స్టార్టయ్యే అవకాశం కనిపిస్తోంది. పది జట్లు బరిలో నిలిచిన మెగా లీగ్ను మార్చి 26వ తేదీ నుంచి నిర్వహించాలని బ్రాడ్కాస్టర్ స్టార్ ఇండియా చేసిన రిక్వెస్ట్ను బీసీసీఐ పరిశీలిస్తోంది. మార్చి 27న లీగ్ మొదలు పెట్టాలని బోర్డు ముందుగా అనుకుంది. ఆ రోజు ఆదివారం కాగా.. ఒక రోజు ముందుగా శనివారం లీగ్ స్టార్ట్ చేస్తే... తర్వాతి రోజు ఆదివారం డబుల్ హెడర్ (రెండు మ్యాచ్లు) జరిపే వీలుంటుందని స్టార్ భావిస్తోంది. దానివల్ల ఫస్ట్ వీకెండ్లోనే మూడు మ్యాచ్లు నిర్వహిస్తే.. 15వ సీజన్ను ఫుల్ జోష్తో మొదలు పెట్టొచ్చన్న విషయాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై బ్రాడ్కాస్టర్తో బోర్డు పెద్దలు చర్చలు జరుపుతున్నారు. వచ్చేవారం లోపు దీనిపై తుది నిర్ణయానికి రావడంతో పాటు లీగ్ షెడ్యూల్ను కూడా రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. శ్రీలంకతో టెస్టు సిరీస్ మార్చి 16నే పూర్తవుతుంది కాబట్టి లీగ్ను ఒక రోజు ముందుకు జరపడం వల్ల ఇండియా ప్లేయర్లకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, దీనివల్ల ఆస్ట్రేలియా ప్లేయర్లు మాత్రం లీగ్లో మరో మ్యాచ్ను మిస్సయ్యే అవకాశం ఉంది.
మెటావర్స్లో గుజరాత్ టైటాన్స్ లోగో రివీల్
అహ్మదాబాద్: ఐపీఎల్–2022లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్న కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్ తమ లోగోను ఆదివారం రివీల్ చేసింది. మిగతా ఫ్రాంచైజీలకు భిన్నంగా మెటావర్స్ (వర్చువల్ స్పేస్)లో ‘ది టైటాన్స్ డగౌట్’ పేరుతో లోగోను రిలీజ్ చేశారు. ఇందులో టీమ్ కోచ్ ఆశిష్ నెహ్రా, కెప్టెన్ హార్దిక్, శుభ్ మన్ గిల్ కనిపించారు.