ముంబై: పశ్చిమాసియాలో యుద్ధం వలన ఇండియాలో యూరియా, డీఏపీ, డైఅమ్మోనియం ఫాస్పేట్ వంటి ఎరువుల వార్షిక ఉత్పత్తి 10–15 శాతం మేర పడిపోనుంది. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రిపోర్ట్ ప్రకారం, సప్లయ్ చెయిన్లో అంతరాయం ఏర్పడడంతో ఎరువుల తయారీలో కీలకమైన ముడిసరుకు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) కొరత ఏర్పడింది. యూరియా తయారీలో 80శాతం ఖర్చు ఎల్ఎన్జీపై ఆధారపడి ఉంటుంది.
కాంప్లెక్స్ ఎరువుల (డీఏపీ, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాసియం– ఎన్పీకే) తయారీలో అమోనియా, ఫాస్ఫారిక్ యాసిడ్ కీలక ముడి పదార్థాలు. వీటిలో కూడా 60–80శాతం మిడిల్ ఈస్ట్ నుంచే వస్తున్నాయి. అయితే, ప్రభుత్వం ఇటీవల ఎల్ఎన్జీ సప్లయ్లో 70శాతం యూరియా తయారీదారులకు కేటాయించడం, మూడు నెలల ఇన్వెంటరీ నిల్వలు, ప్రత్యామ్నాయ దిగుమతులు కొంత ఉపశమనం కలిగిస్తాయని క్రిసిల్ రేటింగ్స్ అభిప్రాయపడింది.
ముడి పదార్థాల ధరలు పెరగడం వల్ల కంపెనీల వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు పెరుగుతాయని, ఎరువుల సబ్సిడీ కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చు అదనంగా రూ.20 వేల–రూ.25 వేల కోట్లు పెరుగుతుందని అంచనా వేసింది. 2026–27లో మొత్తం సబ్సిడీ బడ్జెట్ 12–15శాతం పెరిగి రూ.1.71 లక్షల కోట్లను మించొచ్చని తెలిపింది.
