కడెం కింద క్రాప్​ హాలిడే ..65 వేల ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకం

కడెం కింద క్రాప్​ హాలిడే ..65 వేల ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకం
  • కొట్టుకపోయిన కౌంటర్​ వెయిట్వృథాగా పోయిన 6 టీఎంసీల నీళ్లు 
  • ఆయకట్టుకు నీళ్లివ్వలేమని అధికారిక ప్రకటన
  • 65 వేల ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకం
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు

నిర్మల్, వెలుగు:  కడెం ప్రాజెక్టు స్పిల్​వే మీది నుంచి రెండుసార్లు వరద పొంగిపోయినా కనీసం రిపేర్లు చేపట్టని గత ప్రభుత్వ నిర్లక్ష్యం.. ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. సెప్టెంబర్​26న భారీ వరద కారణంగా నిర్మల్​జిల్లాలోని కడెం ప్రాజెక్టు15వ నెంబర్ గేటు కౌంటర్ వెయిట్ కొట్టుకుపోయింది. నెలరోజులపాటు రోజూ దాదాపు 1,500 క్యూసెక్కుల నీరు వృథాగా పోవడంతో రిజర్వాయర్​ మొత్తం ఖాళీ అయింది. 7 టీఎంసీల నీటిలో 6 టీఎంసీలు నీళ్లు గోదావరిలో కలిశాయి. దీంతో అధికారులు క్రాప్​ హాలిడే ప్రకటించారు. దీంతో రిజర్వాయర్​పై ఆధారపడ్డ 65 వేల ఎకరాల్లో యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారింది. రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. 

మొదటి నుంచీ నిర్లక్ష్యమే.. 

కడెం ప్రాజెక్టును నాటి బీఆర్ఎస్​సర్కారు పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఈ విషయంలో సీడబ్ల్యూసీ, డ్యాంసేఫ్టీ కమిటీల నివేదికలు, హెచ్చరికలను బుట్టదాఖలు చేసింది. నిరుడు జులై12న ఎగువ నుంచి 6 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో రావడంతో కడెం స్పిల్​వే మీదుగా వరద ప్రవహించి, ప్రాజెక్టు కొట్టుకపోయే పరిస్థితి వచ్చింది. దీంతో కడెం ప్రాజెక్టును కాపాడుకోవాలంటే ఇప్పటికే ఉన్న పాత గేట్ల స్థానంలో కొత్త గేట్లు ఏర్పాటు చేయడంతో మరో 2 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేలా అదనపు స్పిల్​వే నిర్మించాలని సీడబ్ల్యూసీ, డ్యామ్ సేఫ్టీ కమిటీలు సర్కారుకు సూచించాయి. వరద ప్రభావాన్ని 12 గంటల ముందే అంచనా వేయడానికి డెసిషన్​ సపోర్ట్​ సిస్టంతో పాటు ప్రాజెక్టుకు ఎగువన రివర్​గేజ్​లు ఏర్పాటు చేయాలని  ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎక్స్​పర్ట్స్ కమిటీ  సైతం సూచించింది. కడెం ప్రాజెక్టు ఎగువన కుప్టి వద్ద మరో రిజర్వాయర్  నిర్మిస్తే కడెంపై ఒత్తిడి తగ్గుతుందని కూడా కమిటీ ప్రతిపాదించింది. మొత్తంగా కడెం ఆధునికీకరణ పనుల కోసం రూ.700 కోట్లు అవసరమని ఇరిగేషన్​శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపింది. కానీ ఏడాది గడిచిపోయినా సర్కారు ఫండ్స్ విడుదల చేయకపోవడంతో కొత్త గేట్ల బిగింపుతోపాటు కొత్త స్పిల్​వే ఏర్పాటు పక్కనపడింది. దీంతో ఈ ఏడాది జులై 27న కూడా మరోసారి స్పిల్​వే మీదుగా వరద పారి కడెం డేంజర్​జోన్​లోకి వెళ్లింది. 

కొట్టుకుపోయిన కౌంటర్​ వెయిట్​.. 

ఫండ్స్​ కొరతతో కడెం ఆధునికీకరణ పనులను పక్కనపెట్టిన గత​ ప్రభుత్వం ఈ ఏడాది కూడా టెంపరరీ రిపేర్ల కోసం కేవలం రూ.2 కోట్లే మంజూరు చేసింది. వాటిని కూడా సకాలంలో రిలీజ్​చేయకపోవడంతో ఏప్రిల్, మే నాటికి పూర్తి చేయాల్సిన రిపేర్లను ప్రాజెక్టు ఆఫీసర్లు హడావిడిగా జూన్​లో కంప్లీట్ చేశారు. అవసరమైన చోట్ల కౌంటర్ వెయిట్ లు, వరద గేట్ల రూలర్స్, రబ్బర్ సీల్స్, రోప్స్ మార్చాల్సి ఉన్నా, కేవలం గ్రీజింగ్, చిన్న చిన్న రిపేర్లతో మమ అనిపించారు. దీంతో సెప్టెంబర్​26న ప్రాజెక్టు15వ నెంబర్ గేటు కౌంటర్ వెయిట్ కొట్టుకపోయింది. గేటు కిందికి దిగే పరిస్థితి లేకపోవడంతో ప్రతిరోజూ దాదాపు1500 క్యూసెక్కుల నీరు వృథాగా దిగువకు వెళ్లిపోయింది. గేటును కిందికి దించేందుకు ప్రాజెక్ట్ అధికారులతో పాటు హైదరాబాద్​నుంచి వచ్చిన ఎక్స్​పర్ట్స్​ఎంత ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. నెలరోజులపాటు నీరంతా వృథాగా పోవడంతో కడెం ఖాళీ అయింది. ఆ తర్వాత ఇసుక సంచులను అడ్డుపెట్టినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కౌంటర్​వెయిట్​కొట్టుకపోయాక కండ్లు తెరిచిన ఆఫీసర్లు గేట్ల పూర్తిస్థాయి రిపేర్ల కోసం  రూ.5.5 కోట్లతో ప్రపోజల్స్​రూపొందించి సర్కారుకు పంపించారు. ఎప్పట్లాగే గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈలోగా ఎన్నికలు వచ్చాయి. కనీసం ఈ ప్రభుత్వమైనా ఫండ్స్​రిలీజ్​చేస్తే గేట్ల రిపేర్లు ప్రారంభించాలని కడెం ఆఫీసర్లు భావిస్తున్నారు. 

ప్రాజెక్ట్​లో ఉన్నది ఒక టీఎంసీ నీళ్లే

ప్రాజెక్టులో 7 టీఎంసీలకు గాను కేవలం ఒక టీఎంసీ మాత్రమే నీళ్లుండటంతో ఈసారి కడెం ఆయకట్టుకు నీళ్లివ్వలేమని ఆఫీసర్లు తాజాగా ప్రకటించారు.  ప్రాజెక్టులో సరిపడా నీళ్లు లేనందున క్రాప్​​హాలిడే ప్రకటిస్తున్నామని, రైతులంతా అర్థం చేసుకొని సహకరించాలని కోరారు. దీంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కొన్నేండ్లుగా కడెం కింద 65 వేల ఎకరాల్లో వానకాలం, యాసంగి సీజన్లలోనూ రైతులు వరి సాగుచేస్తున్నారు.  కానీ సర్కారు, ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్ల ఈసారి పంటకు నోచుకోకుండా పోయామని అన్నదాతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.   

ప్రాజెక్టును పట్టించుకోలే

కడెం ప్రాజెక్టును కేసీఆర్ సర్కారు ఎప్పుడూ పట్టించుకోలే. గేటు కొట్టుకుపోయినా రిపేర్లు చేయలే. అందుకే నీళ్లన్నీ ఉత్తగనే పోయినయ్. ఇప్పుడు ఆఫీసర్లు నీళ్లియ్యం అంటున్నరు. వానకాలం కూడా అంతంతే ఇస్తే తిప్పలు పడ్డం. ఇక యాసంగిలో మొత్తం భూములు పడావు పెట్టాల్సి వచ్చేటట్టున్నది. ఎట్ల బతుకుడో ఏందో సమజైతలేదు.
‑ అల్లం మల్లేశ్ యాదవ్, రైతు, అంబర్ పేట్

యాసంగి పంటలకు నీళ్లివ్వలేం.

.
కడెం ప్రాజెక్టులో ప్రస్తుతం కేవలం ఒక టీఎంసీ నీరు మాత్రమే ఉంది. దీంతో ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీరు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. రైతులు యాసంగిలో ప్రాజెక్టు నీటిపై ఆశలు పెట్టుకోవద్దు. క్రాప్ హాలిడే పాటించాలి. ఫండ్స్​రాగానే ప్రాజెక్టు మరమ్మతులు ప్రారంభిస్తం.

రవికుమార్, జేఈ‌‌‌‌, కడెం ప్రాజెక్ట్​