
- పంచాయతీరాజ్ శాఖ మాజీ సూపరింటెండెంట్ స్కెచ్
- ఫోర్జరీ అపాయింట్ మెంట్స్, ప్రొసీడింగ్ ఆర్డర్స్ తో మోసాలు
- ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్, వెలుగు: పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న మాజీ సూపరింటెండెంట్తో పాటు ఇద్దరు ఏజెంట్లను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.8.85 లక్షలు,18 ఫోర్జరీ అపాయింట్మెంట్ ఆర్డర్స్, 5 ప్రొసీడింగ్ ఆర్డర్ కాపీస్, మూడు సెల్ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్కు చెందిన రాజ్కుమార్(42) ములుగు పంచాయతీరాజ్ సూపరింటెండెంట్గా పని చేసేవాడు. జూనియర్ అసిస్టెంట్స్, రికార్డ్ అసిస్టెంట్స్ ఉద్యోగాలు డైరెక్ట్గా ఇప్పిస్తానంటూ గతంలో సిద్దిపేట జిల్లా అక్కన్నపేటకు చెందిన నిరుద్యోగులను నమ్మించాడు. ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి పోలీసులకు దొరికాడు. రాజ్కుమార్పై చీటింగ్ కేసులు నమోదు కావడంతో సూపరింటెండెంట్ బాధ్యతల నుంచి సస్పెండ్ చేశారు. సస్పెన్షన్లో ఉండి కూడా వరుస మోసాలకు స్కెచ్ వేశాడు.
ఏజెంట్లకు కమీషన్స్ ఇస్తూ..
వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని యువతను రాజ్కుమార్ టార్గెట్ చేశాడు. వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన అర్రొర్ వీరమణి(42), కుల్కచర్లకు చెందిన చిచెంటీ పాండును(33) ఏజెంట్స్గా పెట్టుకున్నాడు. వీరమణి స్థానికంగా ఉంటూనే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని ప్రచారం చేసుకుంది. పాండు బాలాపూర్ మండలం బడంగ్పేట్లో నివాసం ఉంటూ క్యాబ్ డ్రైవర్గా చేస్తున్నాడు. రాజ్కుమార్ చెప్పిన విధంగా పంచాయితీరాజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఫ్రెండ్స్, బంధువులకు చెప్పాడు. ట్రాప్లో చిక్కిన ఒక్కో క్యాండిడేట్ వద్ద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు వసూలు చేశాడు. అందులోంచి ఏజెంట్లకు కమీషన్ఇచ్చేవాడు. జూనియర్ అసిస్టెంట్స్, రికార్డ్ అసిస్టెంట్స్ కోసం పరీక్షలు, ఇంటర్వ్యూలు లేకుండానే జాబ్లో జాయిన్ చేస్తానని నమ్మించేవాడు. ఇందులో భాగంగా క్యాండిడేట్స్ను ఎర్రమంజిల్లోని పంచాయతీరాజ్ హెడ్ ఆఫీస్కి తీసుకెళ్లేవాడు. పార్కింగ్లో వారిని వెయిట్ చేయించి కొంతసేపటి తరువాత ఆఫీస్ నుంచి బయటకు వచ్చేవాడు. ఉన్నతాధికారులు జాబ్ ప్రాసెస్ స్టార్ట్ చేశారని చెప్పేవాడు.
25 మంది నుంచి రూ. 1.27 కోట్లు వసూలు
రాజ్కుమార్ ట్రాప్లో 25 మంది బాధితులు చిక్కారు. వారి నుంచి రూ.1.27 కోట్లు వసూలు చేశాడు. రాజ్కుమార్ఇచ్చిన ఫోర్జరీ అపాయింట్మెంట్ ఆర్డర్స్, ప్రొసీడింగ్ కాపీస్ తీసుకుని బాధితులు పంచాయతీరాజ్ ఆఫీస్కి వెళ్లడంతో వారు మోసపోయిన విషయం బయటపడింది. నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు టీమ్ కేసును దర్యాప్తు చేసి శనివారం రాజ్కుమార్ గ్యాంగ్ను అరెస్ట్ చేసింది.