కొడుకు కోసం మూడు రోజుల్లో ఆరు రాష్ట్రాలు దాటి..

కొడుకు కోసం మూడు రోజుల్లో ఆరు రాష్ట్రాలు దాటి..

తిరువనంతపురం: అనారోగ్యంతో ఉన్న కన్నకొడుకు కోసం 50 ఏళ్ల మహిళ మూడు రోజుల్లో ఆరు రాష్ట్రాలు దాటి కొడుకును చేరుకుంది. లాక్ డౌన్ వల్ల ఎవరూ రోడ్డెక్కకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. కానీ, ఓ మహిళ మాత్రం లాక్ డౌన్ లో కూడా 2700 కిలోమీటర్లు ప్రయాణం చేసి కొడుకును కలుసుకుంది.

కేరళకు చెందిన అరుణ్ కుమార్ బీఎస్ఎఫ్ జవానుగా రాజస్థాన్ లోని జోధ్పూర్ లో పనిచేస్తున్నాడు. రెండునెలల క్రితం అరుణ్ కేరళకు వచ్చి తల్లిని మరియు భార్యపిల్లలను చూసి వెళ్లాడు. జోధ్పూర్ వెళ్లి డ్యూటీలో చేరిన తర్వాత అరుణ్ కండరాల వాపు వ్యాధితో ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ తనవాళ్లను చూడాలని ఉందని అరుణ్ అక్కడి డాక్టర్లకు చెప్పాడు. దాంతో ఆ డాక్టర్లు అరుణ్ గురించి అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దాంతో అరుణ్ తల్లి షీలమ్మ వాసన్ వెంటనే ఎలాగైన కొడుకును చూడాలని అనుకుంది. వెంటనే అరుణ్ ఆరోగ్య పరిస్థితి గురించి కేరళ సీఎం పినరయి విజయన్ తెలపడంతో.. ఆయన కేంద్ర మంత్రి మురళీధరన్ తో మాట్లాడి వారికి సాయం చేయాల్సిందిగా కోరారు. కాంగ్రెస్ నాయకుడు ఊమెన్ చాందీ కూడా జోక్యం చేసుకోవడంతో ఆ తల్లి మూడు రోజుల్లో ఆరు రాష్ట్రాలు దాటి కొడుకును చేరుకోగలిగింది.

షీలమ్మ వాసన్ మాట్లాడుతూ.. దేవుని దయ వల్ల నా కొడుకు ఆరోగ్యం నిలకడగానే ఉంది. మా రాష్ట్ర నాయకులు చేసిన సాయం వల్లే ఈ లాక్ డౌన్ లో కూడా నేను నా కొడుకును చేరుకోగలిగాను. నేను నా కోడలు మరియు మరో బంధువుతో కలిసి 2700 కిలోమీటర్లు ప్రయాణించాం. ఈ దారిలో మేం ఎక్కడా కూడా సమస్యలు ఎదుర్కొలేదు. అరుణ్ ఆరోగ్య పరిస్థితి గురించి జోధ్పూర్ లోని ఎయిమ్స్ వైద్యుడు మాకు తెలియజేశాడు. దాంతో మేం మూడు రోజుల్లో కేరళ నుండి తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ మీదుగా రాజస్థాన్‌కు చేరుకున్నాం. VHP సంస్థ హెల్ప్‌లైన్ వాలంటీర్లు కూడా ఒక క్యాబ్ మరియు ఇద్దరు టాక్సీ డ్రైవర్లను జోధ్‌పూర్‌కు తీసుకెళ్లడానికి ఉచితంగా ఏర్పాటు చేసి మాకు సహాయపడ్డారు’ అని ఆమె తెలిపారు.

రీసెంట్ గా తెలంగాణకు చెందిన ఓ తల్లి కూడా ఏపీలో చిక్కుకున్న కొడుకు  కోసం 1400 కిలోమీటర్లు స్కూటీ మీద వెళ్లి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

For More News..

వృద్ధురాలిని చంపిన దివ్యాంగుడు.. వీడియో తీసిన పొరుగింటి వ్యక్తి