మహా గణపతిం భజే.. ఖైరతాబాద్ బడా గణేశ్ దర్శనానికి లక్షలాదిగా జనం

మహా గణపతిం భజే.. ఖైరతాబాద్ బడా గణేశ్ దర్శనానికి లక్షలాదిగా జనం
  • జనసంద్రంగా ఖైరతాబాద్
  • లక్డీకాపూల్, మాసాబ్​ట్యాంక్​,  
  •   మెహిదీపట్నం వరకు ట్రాఫిక్​ జామ్​
  • పంజాగుట్ట నుంచి స్లో మూవ్​మెంట్​

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఖైరతాబాద్​ బడా గణేశ్ వద్ద భక్తుల రద్దీ పెరుగుతోంది. సోమవారం 2 లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నారు. విశ్వశాంతి గణేశుడి వద్ద130 జంటలతో కల్యాణ మహోత్సవం నిర్వహించారు. కల్యాణోత్సవాన్ని వీక్షించడానికి, గణపతి దర్శనానికి వచ్చిన భక్తులతో పరిసరాలు కిటకిటలాడాయి. ఉదయం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు బడా గణేశ్​ దర్శనానికి అనుమతిస్తున్నారు. 

అయితే, తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే భక్తులు క్యూలైన్లలో కిక్కిరిసికనిపిస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా లక్షల్లో భక్తులు తరలివస్తున్నారు. మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో  భక్తుల తాకిడి కారణంగా ఫుల్​ట్రాఫిక్​జామ్​ అవుతోంది. సోమవారం కూడా ఖైరతాబాద్‌‌ నుంచి మొదలుపెడితే లక్డీకాపూల్, మాసాబ్ ట్యాంక్, మెహిదీపట్నం వరకు రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఈ రద్దీ కారణంగా పీవీఎన్​ఆర్ ​హైవేపై కూడా వాహనాలు జామ్​ అయ్యాయి. 

లక్డీకాపూల్​జంక్షన్​ నుంచి మాసబ్​ట్యాంక్​ చేరడానికి సుమారు గంటకు పైగానే పట్టింది. మెహిదీపట్నం నుంచి మాసబ్​ట్యాంక్​వచ్చేవాళ్లు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనికి 40 నిమిషాలకు పైగానే పట్టింది. మరోవైపు పంజాగుట్ట నుంచి మొదలుపెడితే ఎర్రమంజిల్, ఖైరతాబాద్​ వరకు వాహనాలు చాలా ఆలస్యంగా కదిలాయి. సోమవారం సాయంత్రం నటుడు మంచు మనోజ్​ స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు.