
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీలకు సంబంధించి ఎక్స్పర్టులు, ఇండస్ట్రీ వర్గాలతో కలిసి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపిందని గవర్నమెంట్ అధికారులు తెలిపారు. క్రిప్టో ఇండస్ట్రీపై జరిగిన రివ్యూ మీటింగ్లో ప్రధాని మోడీ, ఇతర మినిస్ట్రీలు ఈ నిర్ణయానికి వచ్చాయని పేర్కొన్నారు. ‘ టెర్రరిస్టులకు ఆర్థిక సాయం అందించడానికి, మనీలాండరింగ్కు క్రిప్టో కరెన్సీలు వేదిక కాకూడదు. యువతను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఆపాల్సి ఉంది’ అని ప్రభుత్వం తెలిపింది. ‘క్రిప్టో కరెన్సీ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న టెక్నాలజీ. దీన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాం. అవసరమైన టైమ్లో సరైన చర్యలు తీసుకుంటాం. ఈ ఇండస్ట్రీ కోసం ముందు చూపుతో చర్యలు ఉంటాయి’ అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. క్రిప్టో కరెన్సీలకు బోర్డర్స్ అంటూ ఏవీ ఉండవు కాబట్టి ఇతర దేశాలతో కూడా కలిసి స్ట్రాటజిక్ పార్టనర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉందనే ఆలోచనలో గవర్నమెంట్ ఉంది. ఆర్బీఐ, ఫైనాన్స్ మినిస్ట్రీ, హోమ్ మినిస్ట్రీలు క్రిప్టోలపై పనిచేస్తున్నాయని, గ్లోబల్గా ఉండే మంచి చర్యలను పరిశీలిస్తున్నాయని ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. క్రిప్టో ఇండస్ట్రీపై స్ట్రాంగ్ రెగ్యులేటరీ ఉంటుందనే సంకేతాలను ప్రభుత్వం ఇచ్చింది.